- ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి
- ఐటీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సమాచారం ఇవ్వట్లేదని ప్రశ్న
- పెట్టుబడులపై వివరాలిచ్చేలా ఆదేశించాలని కేటీఆర్కు లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ఐటీ, ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్ సమాచారం ఇవ్వడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చాక రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో సమాచారం అడిగితే ఇంత వరకు ఇవ్వలేదని, అలాంటప్పుడు ఈ అంకెలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఐటీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మాత్రం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, జాబుల కల్పన సమాచారం మా దగ్గర లేదని ఆర్టీఐ అప్లికేషన్ కు సమాధానం ఇచ్చిందని తెలిపారు. పెట్టుబడుల సమాచారం ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్ కు పద్మనాభరెడ్డి బుధవారం లేఖ రాశారు. సమాచారం అందుబాటులో ఉంచకపోతే ఇవన్ని ఉత్తుత్తి ప్రకటనలేనని పబ్లిక్ అనుకునే అవకాశం ఉందన్నారు