
- వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఫౌండేషన్ సీడ్ అందజేత
- విత్తుకునే సమయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వనున్న శాస్త్రవేత్తలు
- ఈ పంటతోనే ఇకపై లోకల్గానే విత్తనాలు
ఆసిఫాబాద్, వెలుగు: ఇటీవల విత్తనాల ధరలు పెరిగిపోయాయి. దీనికితోడు మార్కెట్లో నకిలీ విత్తనాలు ఎక్కువై రైతు నట్టేట మునుగుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రైతులే స్థానికంగా విత్తనాలు అమ్మే విధానాన్ని తీసుకొచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన వరి, కందులు, పెసర్ల ఫౌండేషన్ సీడ్ను రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అందించింది. వీటిని విత్తుకొనే రైతులకు సాగు సమయంలో వ్యవసాయ అధికారులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో రైతులకు మంచి దిగుబడితోపాటు మేలు జాతి విత్తనాలు లభించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
అప్పట్లో ‘నాగిరి’
వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే పల్లెల్లోని రైతులు అప్పట్లో విత్తనాల కోసం తోటి రైతుల మీద ఆధారపడేవారు. రైతులు తాము పండించిన పంటల్లో కొంత మొత్తాన్ని సాంప్రదాయ రీతిలో శిలీంద్రాలు, పురుగు పట్టకుండా గుమ్ములు, సంచుల్లో భద్రపరిచేవారు. మళ్లీ వచ్చే సీజన్ మొదలుకాగానే వీటిని గ్రామాల్లోని రైతుకు విత్తనంగా ఇచ్చేవారు. ఫలితంగా వేరే పంట విత్తనాలు తీసుకునేవారు. దీంతో రైతుకు విత్తనం ఖర్చు పెద్దగా ఉండేది కాదు. కాలక్రమంలో ఫెర్టిలైజర్, సీడ్ కంపెనీలు రాకతో రైతులకు మేలైన విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొంది.
రైతుకు ఎంతో మేలు
పంట సాగులో రైతులు సాంకేతిక పరిజ్ఞానం పాటిస్తూనే నాటి పద్ధతులను మరువకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ, ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’ కార్యక్రమం చేపట్టి రైతులకు ఫౌండేషన్ సీడ్ పంపిణీని ఈమధ్యే పూర్తిచేశారు. వరిలో జేజీఎల్ 24423 రకం 10 కిలోలు, పెసరలో ఎంజీజీ 347 రకం 4 కిలోలు, కందిలో ఐసీపీఎల్ 87119 రకం 4 కిలోల విత్తనాలను గ్రామాల్లో ఎంపికచేసిన రైతులకు అందించారు. ఈ కార్యక్రమంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఫౌండేషన్ సీడ్ విత్తనాలతో నకిలీ సీడ్ కంట్రోల్ అవుతుందని పేర్కొంటున్నారు. రైతులకు ఫౌండేషన్ సీడ్ ప్రాముఖ్యత, దాని వల్ల దిగుబడి గురించి వివరించనున్నారు. ఈ విత్తనాలతో వచ్చే దిగుబడిని సరైన విధానంలో శుద్ధి చేసి భద్రపరచి మళ్లీ వచ్చే సీజన్ లో దాన్ని లోకల్ రైతులకు అందించాలని సూచిస్తున్నారు.
ఫౌండేషన్ సీడ్స్ తో పెట్టుబడి తగ్గుతోంది
నేను ఈ సారి ఓ బ్యాగు పెసర ధ్యానం ఫౌండేషన్ సీడ్ తీసుకున్నా. బయట విత్తనాలు కొంటే ఖర్చు ఎక్కువ అవుతోంది. ప్రభుత్వమే విత్తనాలు ఇవ్వడంతో మా లాంటి రైతులపై ఆర్థికభారం తగ్గుతోంది. వ్యవసాయ అధికారులు సలహాలు ఇవ్వాలి. ఏ భూమిలో ఏ పంట వేయాలో ముందే చెప్పాలి. విత్తన ఉత్పత్తి ఎలా చేయాలో కూడా తెలియజేయాలి.
మెస్రం ఇంద్రు, రైతు, జైనూర్
విత్తన ఉత్పత్తి పెంపొందించేలా చర్యలు
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి రానున్న రోజుల్లో స్వయంగా రైతులే విత్తనాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నం. జిల్లాలోని 401 గ్రామాల్లోని 1022 మంది రైతులకు 10 కిలోల వరి, 4 కీలోల కంది, పెసర విత్తనాలు ఉచితంగా అందజేశాం. ఈసారి వేసిన పంట నుంచి రాబోయే సీజన్ కు విత్తనాలను స్వయంగా రైతులు ఉత్పత్తి చేసుకునేలా వారిని సిద్ధం చేస్తున్నం. ఫలితంగా నకిలీల జోలికి పోకుండా నాణ్యమైన విత్తనాలతో సాగు చేయవచ్చు.
మిలింద్, ఏడీఏ, ఆసిఫాబాద్