వరుస పరుగు పందేలలో నిలవడమే ..ఆ ఎడ్లు చేసిన పాపం. ఎవరు చేశారో తెలియదు కాని అసూయ… ధ్వేషంతో …రెండు జతల పందెం ఎడ్లను హతమార్చిన విషాద ఘటన.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జరిగింది. పట్టణానికి చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ తన ఎడ్లతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎడ్ల పరుగు పందెంలో పాల్గొంటూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో జరిగిన మూడు పందేలలో సత్యేంద్ర కుమార్ ఎడ్లు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి.
నిన్న కృష్ణా జిల్లా కైకలూరులో పందెంలో పాల్గొని ఎడ్లను అర్ధరాత్రి సామర్లకోటకు తీసుకొచ్చి…. కొట్టంలో కట్టారు. ఉదయం వచ్చి చూసేసరికి…. నాలుగు ఎడ్లు నురగలు కక్కుతూ మృతి చెందాయని …సత్యేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఎద్దుల విలువ 35 లక్షల రూపాయలు ఉంటుందనీ తెలిపారు. ఎవరో అక్కసుతో కావాలని తన ఎడ్లను చంపారని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు ఫిర్యాదుతో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప సంఘటన స్థలానికి వచ్చి రైతును పరామర్శించారు.