తెలంగాణలో నాలుగు రోజులు వానలు

తెలంగాణలో నాలుగు రోజులు వానలు
  • సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ
  • రాష్ట్రవ్యాప్తంగా కోత దశకు పంటలు.. రైతుల్లో ఆందోళన
  • తగ్గిన టెంపరేచర్లు, మెజారిటీ జిల్లాల్లో 40 డిగ్రీలలోపే..

హైదరాబాద్, వెలుగు: వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. మహబూబ్​నగర్, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో నాలుగు రోజులపాటు  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 13న ఆయా జిల్లాలతో పాటు సంగారెడ్డి, వికారాబాద్​, మెదక్, మహబూబ్​నగర్​, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

చల్లబడిన వాతావరణం

రాష్ట్రంలో సోమవారం సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈదురుగాలులు వీచాయి.  నిన్న మొన్నటి వరకు పలుచోట్ల దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మంగళవారం 40 డిగ్రీలలోపు దిగొచ్చాయి. మహబూబ్​నగర్​ జిల్లా వడ్డేమాన్​లో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్​ అయింది. వనపర్తి జిల్లాలో 40.7, ఖమ్మంలో 40.4, గద్వాలలో 40.2, నల్గొండ జిల్లాలో 40.1, కొత్తగూడెంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. వర్షాల ప్రభావంతో ఈ నాలుగు రోజులూ టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మంగళవారం నిజామాబాద్​ జిల్లాలోని పలు చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. 

పంటలపై వర్షాల ఎఫెక్ట్​

రాష్ట్రవ్యాప్తంగా పంటలు కోత దశకు చేరుకున్నాయి. వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు బుగులు పడుతున్నారు. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పది శాతం మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకుంది. మిగతా పొలాల్లోనే కోత దశలో ఉంది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లు, కొనుగోలు సెంటర్లకు తరలించిన ధాన్యాన్ని తడవకుండా కాపాడేందుకు ప్రభుత్వమే టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.