గుండె జబ్బులున్నోళ్లు రోజు రకరకాల టాబ్లెట్లు వేసుకోవడం చూస్తుంటాం. బీపీ, నొప్పి తగ్గించటానికి, కొవ్వు తగ్గటానికి, స్ట్రోక్కు విడివిడిగా మందులు వాడుతుంటారు. మరి, నాలుగు మందులు ఒకే టాబ్లెట్లో కలిసి ఉండే ఫోర్ ఇన్ వన్ టాబ్లెట్ వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా! అందుకే ఇరాన్, బ్రిటన్ సైంటిస్టులు కలిసి ఓ పాలీపిల్ను తయారు చేశారు. నొప్పిని తగ్గించి రక్తాన్ని పలుచన చేసే ఆస్పిరిన్తో పాటు కొవ్వు కరిగించే స్టాటిన్లు, బీపీ మందు, స్ట్రోక్స్ తగ్గించే మందులను కలిపి ఒకే టాబ్లెట్గా తయారు చేశారు. గుండె జబ్బులు లేని వాళ్లు ఈ పాలీపిల్ వాడితే గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. వాళ్లతో పోలిస్తే గుండె జబ్బులు ఉన్న వాళ్లు వీటిని వాడితే తగ్గే రిస్క్ కేవలం సగమన్నారు. ఇరాన్లోని 100 పల్లెలకు చెందిన 7000 మందిపై ఈ పాలీపిల్ను పరీక్షించారు. రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశీలించారు. ఒక గ్రూపుకు కేవలం లైఫ్ అడ్వైస్, మరికొందరికి పాలీపిల్ ఇచ్చారు. పాలీపిల్ వేసుకున్న వారు 34 శాతం తక్కువ సైడ్ ఎఫెక్ట్లు ఎదుర్కొన్నట్లు పరిశోధనలో తేలింది. బీపీలో తేడాలు లేవు. కొవ్వు శాతం తగ్గింది. కేవలం ఈ పాలీపిల్ వేసుకున్నంత మాత్రాన సరిపోదని ఎక్సర్సైజ్లు చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, సిగరెట్ స్మోకింగ్కు దూరంగా ఉండటం చాలా అవసరం అని సైంటిస్టులు చెబుతున్నారు.
