మసాజ్​ పేరుతో 55 లక్షలకు మస్కా : దుబాయ్ లో భారతీయుడిని దోచుకున్న కిలాడీ లేడీలు

మసాజ్​ పేరుతో 55 లక్షలకు మస్కా : దుబాయ్ లో భారతీయుడిని దోచుకున్న కిలాడీ లేడీలు

దుబాయ్ లో ఇండియన్‌‌‌‌ను దోచుకున్న అమ్మాయిలు

దుబాయ్: డేటింగ్ యాప్​లో అందమైన అమ్మాయిలతో మసాజ్ ఆఫర్​కు ఆకర్షితుడైన యువకుడు.. నలుగురు అమ్మాయిల గ్యాంగ్ చేతిలో నిలువు దోపిడీకి గురయ్యాడు. రూ.55.30 లక్షలు పోగొట్టుకుని లబోదిబోమన్నడు. గత నవంబర్​లో దుబాయ్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ న్యూస్​కు దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూ.3,950 చెల్లిస్తే అందమైన అమ్మాయిలతో మసాజ్​ చేయిస్తామంటూ టిండర్​ డేటింగ్​ యాప్​లో వచ్చిన ప్రకటన చూసి 33 ఏండ్ల ఇండియన్ ఫోన్​ చేశాడు. వాళ్ల అడ్రస్ తెలుసుకుని  దుబాయ్ లోని అల్ రెఫా ఏరియాలో ఉన్న అపార్ట్ మెంట్​కు వెళ్లాడు. అపార్ట్ మెంట్​లో ఉన్న ఆఫ్రికన్​ అమ్మాయిలు నలుగురు ఈ యువకుడిని లోపలికి తీసుకెళ్లి బంధించారు. మొబైల్​లో బ్యాంక్  యాప్ ఓపెన్ చేసి డబ్బులు ట్రాన్స్​ఫర్ చేయాలని డిమాండ్ చేశారు.

యువకుడిపై దాడి చేయడంతో పాటు మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఓ మహిళ క్రెడిట్ కార్డు లాక్కుని ఏటీఎంలో రూ.5,92,586 విత్ డ్రా చేసింది. ఒక రోజుపాటు యువకుడిని అపార్ట్ మెంట్​లోనే బంధించారు. అతడి అకౌంట్ నుంచి రూ.49,38,219 వేరే దేశంలోని అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. తర్వాత ఐఫోన్ లాక్కుని వదిలేశారు. వెంటనే బ్యాంకును అలర్ట్ చేసిన బాధితుడు.. తర్వాత పోలీసులకు కంప్లయింట్ చేశాడు. నలుగురు మహిళల గ్యాంగ్ రూ.55,30,806 దోచుకున్నట్టు ఫిర్యాదులోపేర్కొన్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. షార్జాలో ముగ్గురు నైజీరియన్ అమ్మాయిలను అరెస్టు చేశారు. నాలుగో నిందితురాలి కోసం గాలిస్తున్నారు.