గచ్చిబౌలి, వెలుగు: సాఫ్ట్ వేర్ కంపెనీల్లో బ్యాక్ డోర్ జాబ్స్ పేరుతో మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్ఘాట్లోని శ్రీరమణ కాలనీకి చెందిన కె. ప్రణయ్ కుమార్(29) వెబ్ డిజైనర్గా, ర్యాపిడో, స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేశాడు. జీతం సరిపోకపోవడంతో జాబ్ల పేరుతో చీటింగ్కు స్కెచ్ వేశాడు. సైబరాబాద్లో ఉండే సుకేతన్ గతేడాది జూన్ నుంచి ఐటీ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు.
జూన్ 25న వాట్సాప్ ద్వారా సుకేతన్కు ప్రణయ్ పరిచయమయ్యాడు. లండన్లోని ఐబీఎం కంపెనీలో ఐటీ జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు. వివిధ చార్జీల పేరుతో సుకేతన్ నుంచి రూ.3 లక్షల 36 వేల 500 వసూలు చేశాడు. ఆ తర్వాత సుకేతన్ కాల్స్కు ప్రణయ్ రెస్పాండ్ ఇవ్వడం మానేశాడు.మోసపోయినట్లు గుర్తించిన సుకేతన్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రణయ్ బ్యాంక్ అకౌంట్లు, సెల్ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని కర్మన్ ఘాట్లో గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రణయ్పై గతంలోనూ ఓ జాబ్ ఫ్రాడ్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.