- ఫేస్బుక్ అడ్డాగా సాగిన దందా
- మెడికల్ టెస్టులు, 3 నెలలు ఫేక్ ట్రైనింగ్
- 200 మంది నిరుద్యోగులను మోసం చేసి రూ.కోట్లు కొట్టేసిన ఇంటర్ స్టేట్ గ్యాంగ్
- ఇద్దరు నిందితులు అరెస్ట్…రూ 6 లక్షలు రికవరీ
హైదరాబాద్,వెలుగు: రైల్వే డిపార్ట్ మెంట్ లో బ్యాక్ డోర్ జాబ్స్ పేరుతో మోసాలు చేస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ కి చెందిన ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.6 లక్షల క్యాష్, ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్స్, ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. రెండేండ్లుగా సుమారు 200 మందిని నిరుద్యోగులను మోసం చేసి రూ.కోట్లు కొట్టేసిన ఈ గ్యాంగ్ వివరాలను సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ కి చెందిన సర్వేశ్సాహు అలియాస్ అశోక్ కుమార్ సింగ్(32) ఎంబీఏ కంప్లీట్ చేశాడు. అక్కడే ప్రైవేటు జాబ్ చేసేవాడు. ఏపీలోని విజయవాడకు చెందిన అబ్దుల్ మాజీద్ అలియాస్ శ్రీనివాస్(26) బీటెక్ కంప్లీట్ చేశాడు. బ్యాక్ డోర్లో రైల్వే లో జాబ్ కోసం ట్రై చేసి మోసపోయాడు. అదే టైమ్ లో సర్వేశ్ సాహుతో అబ్దుల్ మాజిద్ కు ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇద్దరూ కలిసి బ్యాక్డోర్ జాబ్స్ పేరుతో నిరుద్యోగులను ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన మిశ్రా,కోల్కతాకు చెందిన దినేశ్తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం
నిరుద్యోగులను ట్రాప్ చేసేందుకు మాజిద్ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఫేస్బుక్లో నార్త్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో ట్రాకర్,టీసీ జాబ్స్ కోసం ట్రైనింగ్ ఇస్తామని పోస్టింగ్స్ పెట్టాడు. జాబ్ గ్యారెంటీ, 3 నెలల ట్రైనింగ్ పేరుతో అట్రాక్ట్ చేశాడు. కాల్స్ చేసిన వారికి బ్యాక్ డోర్ జాబ్స్ అని నమ్మించేవాడు. అతడిని కన్సల్ట్ అయిన నిరుద్యోగులతో కలిసి మాజిద్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. జాబ్ లింక్స్ పంపించి వివరాలు,మెడికల్ టెస్ట్,ట్రైనింగ్ పీరియడ్ డీటెయిల్స్ పోస్ట్ చేసేవాడు. మరోవైపు సర్వేశ్ సాహు న్యూ ఢిల్లీలోని రైల్వేస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నతాధికారిగా వర్క్ చేస్తున్నట్టు మాజిద్ వారికి చెప్పేవాడు. దేశవ్యాప్తంగా డిపార్ట్మెంట్లో సాహుకు పలుకుబడి ఉందని రెకమెండేషన్తో ఆయన బ్యాక్డోర్ జాబ్స్ ఇప్పిస్తాడని నిరుద్యోగులను నమ్మించేవాడు.
మెడికల్ టెస్ట్ కోసం రూ.50 వేలు
ఇలా ట్రాప్ చేసిన నిరుద్యోగులకు మాజిద్ జాబ్ లింక్స్ పంపి క్యాండిడేట్స్ వివరాలు, క్వాలిఫికేషన్,ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నారనే డీటెయిల్స్ కలెక్ట్ చేసేవాడు. ఒక్కో క్యాండిడేట్ నుంచి మెడికల్ టెస్ట్ పేరుతో రూ.50 వేలు వసూలు చేసేవాడు. డబ్బులు చెల్లించిన వారికి ఢిల్లీలోని రైల్వే హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ చేయించేవాడు. ఇందుకోసం బ్లడ్ శాంపుల్స్ తీసుకుని క్యాండిడేట్స్ ను పంపించేవాడు. తర్వాత వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్ అందించి రైల్వేలో జాబ్ కి సెలక్ట్ అయ్యారని చెప్పేవాడు. ఢిల్లీ పహాడ్ గంజ్లోని డివిజన్ రైల్వే మేనేజర్ ఆఫీసులో గ్యాంగ్ మెంబర్ మిశ్రా, వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్ పూర్ ఆఫీసులో మరో మెంబర్ దినేశ్ను సూపర్ వైజర్స్ గా పనిచేస్తున్నారని క్యాండిడేట్స్ ను నమ్మించాడు.
ఇలా దొరికిన్రు
రాజేంద్రనగర్లోని బండ్లగూడకి చెందిన నాగేశ్వర రావు, బాలకోటి ఇద్దరూ 2019 అక్టోబర్లో మాజిద్,సర్వేశ్ సాహును అప్రోచ్ అయ్యారు. నాగేశ్వరరావు తన కొడుకుకి రైల్వే జాబ్ కోసం రూ.8లక్షల 50 వేలను సర్వేశ్ గ్యాంగ్కి చెల్లించాడు. బాలకోటి తనకు జాబ్ కోసం రూ.6 లక్షల 30వేలు ఇచ్చాడు. సర్వేశ్ గ్యాంగ్ నాగేశ్వరరావు కొడుకుకి. బాలకోటికి ఫేక్ కాల్ లెటర్స్ అందించి, ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చింది. తర్వాత వీరికి ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్స్, ఐడీ కార్డ్స్ అందించి ఇంటికి పంపింది. రెండేండ్లు గడుస్తున్న జాబ్ జాయినింగ్ కాల్స్ రాకపోవడంతో బాధితులు ఢిల్లీలోని డీఆర్ఎం ఆఫీసుకి వెళ్లి ఎంక్వయిరీ చేశారు. తాము మోసపోయినట్లు గుర్తించారు. ఈ నెల 15న రాజేంద్రనగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్ ఆధారంగా జాబ్ ఫ్రాడ్ గ్యాంగ్ కి చెందిన సర్వేశ్, మాజిద్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ సుమారు 200 మంది నిరుద్యోగులను మోసం చేసి ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసిందని సీపీ సజ్జనార్ చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు మిశ్రా,దినేశ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.