పూజల పేరిట రూ. 15. 30 లక్షలు వసూలు... నకిలీ స్వామితో పాటు మరో ఐదుగురు అరెస్టు

పూజల పేరిట రూ. 15. 30 లక్షలు వసూలు...  నకిలీ స్వామితో పాటు మరో ఐదుగురు అరెస్టు
  • కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్​ వెల్లడి

కరీంనగర్ క్రైం / గంగాధర,వెలుగు : పూజల పేరిట డబ్బు దోచుకుని, బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ స్వామితో పాటు ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్​ శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు. కొత్తపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన కనకయ్య ఆర్టీసీ డ్రైవర్.. కాగా ప్రమాదంలో అతని ఎడమ కాలు విరిగింది. అతని భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. పదిహేను రోజుల కింద స్వామి వేషంలో ఉన్న ఒక వ్యక్తి శ్రీరాములపల్లికి వెళ్లి కనకయ్య కొడుకు గజ్జి ప్రవీణ్ ను పరిచయం చేసుకున్నాడు. 

దీంతో అతను తమ ఇంట్లోని సమస్యలను స్వామికి చెప్పుకున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకుని చందుర్తికి చెందిన ఈర్నాల రాజు, ఆగ్రహారం గ్రామానికి చెందిన మిరియాల దుర్గయ్య, చీర్లవంచకు చెందిన చల్లా అజయ్, సతీష్ ముఠాగా ఏర్పడ్డారు. ఇంటి పక్కనే బంగారు కడ్డీ ఉందని, దాన్ని బయటకు తీసి పూజలు చేస్తే తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుందని ప్రవీణ్ ను నమ్మించారు. లేదంటే అతని తండ్రి నెల రోజుల్లో చనిపోతాడని భయపెట్టారు. 

పూజలు చేయడానికి సామగ్రి కొనుగోలు చేయాలని విడతల వారీగా రూ.15.30 లక్షల నగదు ప్రవీణ్ నుంచి వసూలు చేశారు. ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడుతుండగా అనుమానం వచ్చిన ప్రవీణ్ కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిందితుల కోసం గాలింపు చేపట్టగా చింతకుంట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో దొంగ స్వామితో పాటు మరో నలుగురు పట్టుపడ్డారు. వీరి వద్ద రూ. 15.30 లక్షల నగదు, 7 తులాల బంగారం, మూడు కార్లు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి సిబ్బంది ఉన్నారు.