ఫేక్ ప్రాజెక్ట్ వర్క్స్ పంపించి ట్రాప్ రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలంటూ డబ్బులు వసూలు
లీగల్ యాక్షన్ ఉంటుందని బ్లాక్ మెయిల్ చేస్తున్న
సైబర్ క్రిమినల్స్ మనీ డిపాజిట్ చేయకపోతే కేసు ఫైల్ చేస్తామని బెదిరింపు
హైదరాబాద్,వెలుగు: పార్ట్టైమ్ జాబ్,వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అప్లై చేసుకున్న వారిని సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేశారు. ఫేక్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్, జాబ్ పోర్టల్స్తో నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వర్క్తో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించవచ్చని అట్రాక్ట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జెస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫేక్ ప్రాజెక్ట్ వర్క్స్ పంపించి డెడ్లైన్ విధిస్తున్నారు. వర్క్ కంప్లీట్ చేయని వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇందుకోసం జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేసిన నిరుద్యోగులు,స్టూడెంట్స్ డేటాను కలెక్ట్ చేస్తున్నారు. డేటాబేస్ ఆధారంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు స్కెచ్ వేస్తున్నారు. ఒకే ఒక్క లెటర్ తేడాతో ఫేక్ వెబ్ పేజెస్ ను క్రియేట్ చేస్తున్నారు.హై ప్రొఫెషనల్ జాబ్స్,ఆన్లైన్లో పార్ట్టైమ్ వర్క్ పేరుతో తక్కువ టైమ్ లో ఎక్కువ సంపాదన ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. బల్క్మెసేజ్లు, సోషల్ మీడియాలో ఫేక్ జాబ్స్ లింక్స్ వైరల్ చేస్తున్నారు. నిరుద్యోగుల మెయిల్ ఐడీకి ఫేక్ మెయిల్స్ పంపిస్తున్నారు.
ఫేక్ వర్క్ ఆర్డర్స్..అగ్రిమెంట్స్
ఫేక్ వర్క్ ఆర్డర్,అగ్రిమెంట్,ప్రాజెక్ట్ డేటాను తమ ట్రాప్ లో చిక్కిన నిరుద్యోగులు, స్టూడెంట్స్ కు సైబర్ క్రిమినల్స్ మెయిల్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ, పీడీఎఫ్ ఫైల్స్ను వర్డ్ ఫైల్స్గా మార్చడం, ప్రాజెక్ట్ వర్క్లోని వర్డ్స్ కాపీ పేస్ట్ చేయాలని నమ్మిస్తున్నారు. అలాట్మెంట్ చేసిన టైమ్లోపు వర్క్ కంప్లీట్ చేయాలని కండీషన్ పెడుతున్నారు. ముందుగా తక్కువ టైమ్ లో పూర్తి చేసేలా ఈజీ వర్క్ ఇస్తున్నారు. చైన్ సిస్టమ్తో మెంబర్స్ను చేర్చించాలని చెప్తున్నారు. మెంబర్స్ను జాయిన్ చేసిన వారికి బోనస్ పాయింట్స్ ఇస్తామని నమ్మిస్తున్నారు. సెక్యూరిటీ పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటున్నారు. రూ.60 వేల విలువ చేసే ప్రాజెక్ట్ వర్క్ కోసం రూ3,500 రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తున్నారు.
ఫెయిల్యూర్ లాస్పేరుతో లీగల్ నోటీసులు
10 రోజుల డెడ్లైన్తో ఫేక్ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారు. ఇన్టైమ్లో వర్క్ కంప్లీట్ చేయలేదని పార్ట్ టైమ్ జాబ్ క్యాన్సిల్ చేశామని చెప్తున్నారు. కంపెనీ రూల్స్ ప్రకారం పార్ట్ టైమర్ ఈ నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్క్ ఫెయిల్యూర్ లాస్ పేరుతో ఫేక్ లీగల్ నోటీసులు మెయిల్ చేస్తున్నారు. అమౌంట్ డిపాజిట్ చేయకపోతే ఉత్తర్ప్రదేశ్ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తామని, రికవరీ ఏజెంట్స్ ఇంటికి వస్తారని బెదిరిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురవుతున్న బాధితులు సైబర్ నేరగాళ్ళు అడిగినంత చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కో బాధితుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు.
రూ. 50 వేలు ఇవ్వాలని వేధిస్తున్నరు
పార్ట్టైమ్ జాబ్ కోసం ఈ నెల 4న ఆన్లైన్లో సెర్చ్ చేశా. మరుసటిరోజు నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. పార్ట్ టైమ్ వర్క్ ఇస్తామని చెప్పారు. సుమారు వెయ్యి పేజీల వర్క్ను 10 రోజుల్లో కంప్లీట్ చెయ్యాలన్నారు. సాధ్యం కాదని చెప్పాను. యూపీ హైకోర్టులో నాపై కేసు ఫైల్ చేశామని ఫేక్ లీగల్ నోటీసులు మెయిల్ చేశారు. రూ.50 వేలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశా.
– నరేశ్, బీటెక్ స్టూడెంట్, బండ్లగూడ