సంక్షేమ పథకాలు కాదు..విద్య, వైద్యం సమకూర్చితే చాలు

సంక్షేమ పథకాలు కాదు..విద్య, వైద్యం సమకూర్చితే చాలు
  •     అరుణోదయ విమలక్క

బషీర్‌‌బాగ్, వెలుగు: విద్యాభివృద్ధికి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క డిమాండ్ చేశారు. ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వాలు సమకూర్చితే సంక్షేమ పథకాల అవసరం పెద్దగా ఉండదని అన్నారు. తల్లుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మితో కలిసి ఆమె మాట్లాడారు. 

ప్రభుత్వ బడిలో చదివి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పేదలకు విద్యను దూరం చేసేలా ప్రభుత్వ బడులనే మూసివేస్తామనడం సరికాదన్నారు. ఆ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసేందుకు ప్రజలు కృషి చేస్తున్నారని తెలిపారు. 

ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు లలిత, రాధ, విజయలక్ష్మి, లావణ్య, సాయిలక్ష్మి, శోభ, అనిత పాల్గొన్నారు.