హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ నెల 9 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి బస్సు ఎక్కే ప్రతి మహిళా ఏదేని గుర్తింపు కార్డు చూపిస్తే జీరో టికెట్ జారీ చేయడం ప్రారంభమైంది. ఇందుకోసం మహిళలు తమ వెంట గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని ఎండీ సజ్జనార్ సూచించారు. గుర్తింపు కార్డును కండక్టర్లకు చూపించి జీరో టికెట్ను తీసుకోవాలంటున్నారు.
నిన్న అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. టికెట్లు జారీ చేసే యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశామన్నారు. బుధవారం రాత్రి నుంచే కుషాయిగూడ, మిధాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా ‘జీరో టికెటింగ్’ అమలు చేసినట్లు పేర్కొన్నారు. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమల్లోకి తెచ్చామని అధికారులు తెలిపారు.