V6 News

దేశమంతా ఫ్రీ వైఫై: పీఎం వాణి ప్రోగ్రామ్​కు కేంద్ర కేబినెట్​ ఓకే

దేశమంతా ఫ్రీ వైఫై: పీఎం వాణి ప్రోగ్రామ్​కు కేంద్ర కేబినెట్​ ఓకే

పీడీవో, పీడీవోఏ, యాప్​ ప్రొవైడర్ల ద్వారా సేవలు
ఫీజు లేకుండానే వాటికి అనుమతులు
కొత్త కొలువులకు రూ.22,810 కోట్లు కేటాయింపు
కొచ్చి–లక్షద్వీప్​ మధ్య ఆప్టిక్​ ఫైబర్​​ కనెక్టివిటీ
బీఎస్​ఎన్​ఎల్​కు పనులు అప్పగింత

కొన్ని రోజుల్లో జనానికి  ఫ్రీ వైఫై అందుబాటు లోకి రానుంది. ‘పీఎం వాణి’ అనే కొత్త స్కీమ్​కింద కేంద్ర ప్రభుత్వం పబ్లిక్​ ప్లేసెస్​లో వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఎలాంటి లైసెన్స్​లు, ఫీజు, రిజిస్ట్రేషన్లు లేకుండానే ఈ సౌకర్యం కల్పించనుంది. ఈజ్​ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.

పీడీవో, పీడీవోఏ, యాప్​ ప్రొవైడర్ల ద్వారా సేవలు
ఫీజు లేకుండానే పర్మిషన్లు.. కేంద్ర కేబినెట్​ నిర్ణయం

న్యూఢిల్లీ: దేశం మొత్తం ఇంటర్నెట్​ సౌలతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. జనానికి ఫ్రీగా వైఫైని అందించబోతోంది. ‘పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్​ నెట్​వర్క్​ ఇంటర్​ఫేస్​)’ అనే కొత్త స్కీం కింద పబ్లిక్​ ప్లేసెస్​లో వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పీఎం వాణితో పాటు మరికొన్ని అంశాలకు బుధవారం కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. పీఎం వాణిలో భాగంగా ఎలాంటి లైసెన్స్​లు, ఫీజు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వైఫై సౌకర్యాలను కల్పించనుంది.

మూడు అంచెలుగా..

ఫ్రీ వైఫై సేవలను కేంద్రం మూడు అంచెలుగా అందించనుంది. పబ్లిక్​ డేటా ఆఫీస్(పీడీవో), పబ్లిక్​ డేటా ఆఫీస్​అగ్రిగేటర్స్(పీడీవోఏ), యాప్​ ప్రొవైడర్లను ఏర్పాటు చేయనుంది. వైఫై యాక్సెస్​ పాయింట్లను ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, ఆపరేషన్లను పీడీవోలు చూస్తాయి. జనాలకు నెట్​ సర్వీసులను అందిస్తాయి. పీడీవోలకు మధ్యవర్తులుగా పీడీవోఏలు పనిచేస్తాయి. ఆథరైజేషన్​, అకౌంటింగ్​ వంటి వ్యవహారాలను చూస్తాయి. జనాలు నెట్​ సౌకర్యం పొందేలా యాప్​లను డెవలప్​ చేయడం, వైఫై హాట్​స్పాట్స్​ను గుర్తించడం వంటి పనులను యాప్​ప్రొవైడర్లు చూసుకుంటారు. పీడీవో, పీడీవోఏ, యాప్​ ప్రొవైడర్ల వివరాలను సెంట్రల్​ టెలికాం డిపార్ట్​మెంట్​(సీడాట్​) ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్​ రిజిస్ట్రీ మెయింటెయిన్​ చేస్తుంది. పీడీవోలు చిన్న చిన్న షాపులు, కామన్​ సర్వీస్​ సెంటర్లలో కూడా ఏర్పాటు చేసుకునే వీలుంటుందని కమ్యూనికేషన్స్​ మినిస్టర్​ రవి శంకర్​ ప్రసాద్​ చెప్పారు.

కొలువులకు రూ.22,810 కోట్లు

కొలువుల భర్తీకి బూస్ట్​నిచ్చేందుకూ కేంద్రం సంకల్పించింది. నిరుద్యోగులకు జాబ్స్​ ఇచ్చేలా కంపెనీలను ఎంకరేజ్​ చేసేందుకు ఆత్మనిర్భర్​ భారత్​ రోజ్​గార్​ యోజన(ఏబీఆర్​వై) కింద రూ.22,810 కోట్లను కేటాయించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్​ భారత్​ ప్యాకేజ్​3.0ను ప్రకటించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నిధులను 2020–2023 వరకు మూడేళ్ల కాలానికిగానూ వాడుకోవాలంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించింది. స్కీంలో భాగంగా 2020 అక్టోబర్​ 1 నుంచి 2021 జూన్​ 30 మధ్య కొత్తగా తీసుకున్న ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందని కేంద్ర మంత్రి సంతోష్​ గంగ్వార్​ ప్రకటించారు.