జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ రెండు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీలను మే 5న ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ పరీక్షల తేదీలను మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మే 5 న ప్రకటిస్తారని, అదే రోజున ఆయన విద్యార్థులతో ఆన్ లైన్లో ముచ్చటిస్తారని అధికారులు పేర్కొన్నారు.
వాస్తవానికి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ నెలలో నిర్వహించాల్సి ఉండగా, నీట్ పరీక్ష మే 3న నిర్వహించాల్సి ఉంది. అయితే, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి లాక్డౌన్ విధించడంతో పలుమార్లు ఈ పరీక్షల నిర్వహణ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ రెండు పరీక్షలపై మరో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.