
- ఫుల్గా మద్యం తాగించి కత్తితో కోసి, సిలిండర్తో కొట్టి చంపిండు
గండిపేట, వెలుగు : అప్పు పైసలు ఇవ్వడంలేదని, వ్యక్తిగత కక్షతో ఫ్రెండ్ కు మద్యం తాగించి దారుణంగా హత్య చేసిన నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎర్రబోడ ప్రాంతానికి చెందిన సాయికార్తీక్ (29), నవీన్, సిద్ధూరెడ్డి ఫ్రెండ్స్. సిద్ధూరెడ్డి భార్యతో విడిపోయి ఉంటున్నాడు.
కొంతకాలం కింద ముగ్గురూ కలిసి వ్యాపారం ప్రారంభించగా, సిద్ధూరెడ్డి రూ. 6 లక్షలు అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే సాయి కార్తీక్, నవీన్ తప్పించుకొని తిరుగుతున్నారు. అలాగే తన భార్య నుంచి విడిపోవడానికి కూడా వీరిద్దరే కారణమని కక్ష పెంచుకున్నాడు. తన ప్లాన్లో భాగంగా గురువారం రాత్రి ఇద్దరిని తన ఇంటికి పిలిపించి, ఫుల్గా మద్యం తాగించాడు.
మత్తులోకి జారుకున్న తర్వాత తొలుత సాయి కార్తీక్ను ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి, సిలిండర్తో కొట్టి చంపాడు. అనంతరం నవీన్ను సైతం హత్య చేసేందుకు యత్నించగా, అతడు తప్పించుకొని పారిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సిద్ధూరెడ్డిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.