పెళ్లైంది.. తాగను అన్నందుకు పొట్టుపొట్టు కొట్టారు

పెళ్లైంది.. తాగను అన్నందుకు పొట్టుపొట్టు కొట్టారు

మందు మానేశాను. ఇక తాగను. అని చెప్పిన ఓ వ్యక్తిని అతని స్నేహితులు చావబాదారు. పెళ్లైంది.. ఇకపై తాగాలనుకోవటం లేదు అన్నందుకు.. అతనిపైనా.. అతడి కుటుంబంపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది.

అమృత్ పాల్ అనే వ్యక్తి పెళ్లికి ముందు తన ఫ్రెండ్స్ తో కలసి మందు కొట్టేవాడు. ఫుల్లుగా పార్టీలు చేసుకొనే వాడు. కొన్నాళ్ల క్రితం అతనికి పెళ్లయింది. రీసెంట్ గా అతడి ఫ్రెండ్స్ సిట్టింగ్ వేస్తే.. అక్కడ వారితో కలిశాడు అమృత్ పాల్. ఫ్రెండ్స్ అందరూ తమకు కంపెనీ ఇవ్వాలని అతడిని అడిగారు. ఐతే… మ్యారేజ్ తర్వాత మద్యం మానేసినట్టు తన బ్యాచిలర్ ఫ్రెండ్స్ కు చెప్పాడు.

దీనిపై కోప్పడ్డ అతని ఫ్రెండ్స్ పెళ్లైతే మందు మానేయాల్సిన రూలేం లేదని, తమతో పాటు మందెయ్యాలని గొడవ చేశారు. అందుకు అమృత్ పాల్ ససేమీరా అనడంతో.. కోపం పెంచుకున్న అతని స్నేహితులు రాత్రి ఫుల్లుగా మద్యం తాగి అతడి ఇంటిపై దాడి చేశారు. అమృత్ పాల్‌తో పాటు అతడి భార్య, కుటుంబసభ్యులను కూడా చావబాదారు. పెళ్లయితే మద్యం మానేస్తావా? అంటూ అమృత్ ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.