Tatkal Tickets: ఇకపై ఆటలు కుదరవ్.. జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త రూల్స్..

Tatkal Tickets: ఇకపై ఆటలు కుదరవ్.. జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త రూల్స్..

Tatkal New Rules: వాస్తవానికి రైల్వేలు విక్రయించే తత్కాల్ టికెట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. చాలా మంది చివరి నిమిషాల్లో తమ ప్రయాణం కోసం అత్యవసరంగా టిక్కెట్లను పొందటం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటుంటారు. అయితే దీనిని కొందరు దళారులు, బుక్కింగ్ ఏజెంట్లు తమ స్వార్థ లాభచింతనతో దుర్వినియోగం చేస్తున్నట్లు రైల్వే శాఖ గుర్తించింది. కావాల్సిన వారికి దక్కాల్సిన టిక్కెట్లు క్షణాల్లో మాయం కావటంపై దృష్టి పెట్టిన రైల్వే సంస్థ దీనిని అరికట్టేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 

రైల్వే శాఖ జూలై 15 నుంచి తత్తాల్ టిక్కెట్లను ఆధార్ ప్రామాణీకరణ ద్వారానే అందించాలని నిర్ణయించింది. కొన్ని రోజుల కిందట కేంద్ర రైల్వే మంత్రి కూడా తన ఎక్స్ ఖాతాలో ఇదే విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో తత్కాల్ టిక్కెట్ బుక్కింగ్ ఓపెన్ కాగానే వాటిని ఏజెంట్ల నియంత్రణ ఉండేది. అయితే మారిన రూల్స్ ప్రకారం రైల్వే ఏజెంట్లు అరగంట తర్వాత టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. అప్పట్లో తత్తాల్ విండో ఓపెన్ కాగానే ఏజెంట్లు దాదాపుగా అన్ని టిక్కెట్లను బుక్ చేయటం వల్ల సాధారణ ప్రయాణికులు టిక్కెట్లు దొరక్క ఇబ్బందిపడేవారు. 

జూన్ 10న భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. వచ్చేనెల నుంచి ప్రయాణికులు ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారానే ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవటం కుదురుతుంది. జూలై 15 నుంచి టిక్కెట్ల బుక్కింగ్ సమయంలో ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ అమలులోకి వస్తుంది. ఓటీపీ బుకింగ్ సమయంలో వినియోగదారులు అందించిన మెుబైల్ నంబర్లకు పంపబడుతుంది. 

తత్కాల్ టికెట్ బుక్కింగ్ టైమింగ్స్ ఇలా.. 
తత్కాల్ రైల్వే టిక్కెట్ల బుకింగ్ విండో ఉదయం 10 గంటలకు తెరుచుకుంటుంది. ఈ సమయంలో AC కోచ్ టిక్కెట్లు మాత్రమే బుక్కింగ్ చేసుకోవటానికి వీలుంటుంది. స్లీపర్ కోచ్ టిక్కెట్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు తత్కాల్ విండోలో ప్రారంభమవుతుంది. 

కొత్త సర్క్యులర్ ప్రకారం జెంట్లు ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు AC కేటగిరీకి.. ఉదయం 11 నుండి 11.30 గంటల వరకు స్లీపర్ కేటగిరీకి 'తత్కాల్' టిక్కెట్లను బుక్ చేసుకోకుండా నిషేధించబడ్డారు. ఇది సామాన్య ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో ఉండేలా చేస్తుంది.