
ఎన్నో మధుర జ్ఞాపకాలు, మరెన్నో తీపి గుర్తులు. జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ప్రపంచమంతా 2020 సంవత్సరానికి ఘన స్వాగతం చెప్పేసింది. 2019కి సంబంధించిన హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినీ లోకం కూడా కొత్త ఆశలతో 2020 ని స్వాగతించింది. అయితే గతేడాదిలో తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా కనిపించిన కొందరు పెళ్లి పీటలెక్కారు. కొందరు సహ నటుల్ని, మరి కొందరు స్నేహితుల్ని పెళ్లాడారు. వాళ్లెవరో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం.
అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సయేషా సైగల్ గత ఏడాది మార్చి 10న తమిళ హీరో ఆర్య ను పెళ్లి చేసుకుంది. అదే సంవత్సరం వాలెంటైన్స్ డే సందర్భంగా ‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. ఆశీర్వదించండి’ అంటూ ట్విటర్ వేదికగా పోస్టు పెట్టిన సయేషా.. మార్చి నెలలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు అందులో తెలిపింది. అనుకున్నట్టుగానే మార్చి 10 న హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి పెళ్లి జరిగింది. వీళ్లిద్దరూ కలసి భలేభలే మగాడివోయ్ రీమేక్ గజినీకాంత్ (తమిళ్ సినిమా)లో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్లిద్దరి జోడీ మాత్రం సూపర్ హిట్ అయింది.
మన భల్లాల దేవుడు రానా ఫస్ట్ మూమీ ”లీడర్” లో నటించిన రిచా గంగోపాధ్యాయ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. లీడర్ తర్వాత నాగవల్లి, విరపకాయ్, మిర్చి వంటి హిట్ చిత్రాల్లో నటించిన రిచా.. ఆ తర్వాత సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి MBA చదువు కోసం వాషింగ్ టన్ వెళ్లింది. అక్కడ తన బిజినెస్ స్కూల్ బాయ్ఫ్రెండ్ జో లాంగెల్లాతో రిచా ప్రేమలో పడింది. 2019 జనవరిలో అతనితో నిశ్చితార్థం జరిగినట్లు కూడా ప్రకటించింది. ఆ తర్వాత సెప్టెంబర్ లో క్రిస్టియన్, హిందూ మత సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు.
2019 లోనే మన తెలుగు హీరోయిన్ అర్చన వివాహం కూడా జరిగింది. హెల్త్కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్తో ఇరు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నవంబర్ 13 న వీరి పెళ్లి జరిగింది. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్లో గ్రాండ్ గా ఈ జంట తమ పెళ్లి వేడుకను జరుపుకుంది. 2004లో ‘తపన’ సినిమాతో ఇండస్ట్రీకి నటిగా పరిచయమైన అర్చన.. ‘నేను’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘సామాన్యుడు’ తదితర చిత్రాల్లో ఆమె నటించింది.
ఒకరికి ఒకరు సినిమా గుర్తుందా? అందులో ప్రియుడి ఎడబాటు భరించలేని యువతిగా తన నటనతో మెప్పించిన ఆర్తి చాబ్రియా కూడా పెళ్లి చేసుకుంది. మారిషస్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీని జూన్ 24 న ముంబైలో వివాహం చేసుకుంది. తన భర్త గురించి చెబుతూ.. పెళ్లైన తర్వాత కూడా తన వృత్తి కొనసాగించవచ్చనే స్వేచ్ఛ తన భర్త నుంచి పొందానని, తాము ఇండియాలోనే ఉంటున్నామని తెలిపింది ఆర్తి. ఒకరికి ఒకరు తర్వాత ఈ హీరోయిన్ తెలుగులో గోపి గోడమీద పిల్లి , ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి , చింతకాయల రవి తదితర చిత్రాల్లో నటించింది.
‘లవ్ ఫెయిల్యూర్’ , దోచేయ్, క్రిష్ణార్జున యుద్ధం చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన వీజే పూజా రాంచంద్రన్ నటుడు అనీష్ జాన్ కొక్కెన్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే. ఏప్రిల్ 15న కేరళలో వీరి వివాహం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చిన పూజా మన తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.