- బడ్జెట్ విడుదల చేయని ప్రభుత్వం
- ఏడాదిగా సర్వీస్ ప్రొవైడర్లకు అందని బిల్లులు
- 2 నెలలుగా నిలిచిపోయిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన ఆర్టీఏని నిధుల కొరత వేధిస్తోంది. ఏడాది నుంచి సర్వీస్ ప్రొవైడర్లు, ఏడాదిన్నర నుంచి అద్దె వాహనాల డ్రైవర్లకు బిల్లులు చెల్లించట్లేదు. ఆర్టీఏకి గత ఆర్థిక సంవత్సరంలో ₹4 వేల కోట్లదాకా ఆదాయం వచ్చింది. ఈసారి ₹100 కోట్ల వరకు బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు. ఇందులో ఇప్పటిదాకా వచ్చింది కేవలం కోటిన్నర. టైంకు నిధులు విడుదల కాకపోవడంతో చాలా పనులు పెండింగ్లో పడుతున్నాయి. ఐటీ విభాగంలో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్ల సంస్థలకు డబ్బులు కట్టట్లేదు. శ్రీనాథ్, సీఎంఎస్, ఎంటెక్, ఓరియంట్, కోర్స్ వంటి సంస్థలు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సులు, కార్డుల ప్రింటింగ్ తదితర పనులను అవి చూస్తున్నాయి. మూడు నెలలకోసారి ఆయా కంపెనీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. కానీ, ఇప్పుడు ఏడాది అవుతున్నా డబ్బులు ఇవ్వలేదు. ₹25 కోట్ల దాకా ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. దీంతో రెండు నెలలుగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిలిచిపోయింది.