
- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖుల నివాళులు
హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్రతన్ అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. రాజీవ్ రతన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
అంతకుముందు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని రాజీవ్ రతన్ నివాసంలో రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఐపీఎస్ అధికారిగా రాజీవ్ రతన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన భార్య, కుమారుడిని పరామర్శించారు. రాజీవ్ రతన్తో తనకున్న అనుబంధాన్ని డీజీపీ రవిగుప్తా ఓ ప్రకటనలో గుర్తు చేసుకున్నారు. రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం తన కొడుకుతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.