తెలంగాణ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ  స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ  స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్‌ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది.  కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.  దీంతో రేపు సభలో ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రకటించనున్నారు.  గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్  నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.  

కాంగ్రెస్ పార్టీలో గడ్డం ప్రసాద్‌ కుమార్‌  సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రసాద్‌ కుమార్‌  చేనేత, చిన్న తరహా పరిశ్రలమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో జన్మించిన ప్రసాద్‌ కుమార్‌ .. తాండూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.

 తెలంగాణ ఉద్యమ సమయంలో.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో.. చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.