గాలి జనార్దన్ రెడ్డికి ఏడేండ్ల జైలు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు

 గాలి జనార్దన్ రెడ్డికి ఏడేండ్ల జైలు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు
  • నిర్దోషులుగా మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృపానందరెడ్డి
  • జనార్దన్ రెడ్డి సహా నలుగురికి ఏడేండ్ల జైలు శిక్ష.. రూ. లక్ష చొప్పున ఫైన్ 
  • అదుపులోకి తీసుకున్న సీబీఐ.. చంచల్‌‌గూడ జైలుకు తరలింపు 
  • పదిహేనేండ్ల విచారణ తర్వాత తీర్పు
  • హైకోర్టులో అప్పీల్ చేసిన జనార్దన్ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్‌‌ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి హయాంలో సంచలనం సృష్టించిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌‌ రెడ్డి సహా నలుగురిని సీబీఐ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. నలుగురికీ ఏడేండ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి ఐఏఎస్‌‌ కృపానందరెడ్డిని నిర్దోషులుగా ప్రకటించింది.

 దాదాపు 15 ఏండ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసులో మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) ఓనర్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పర్సనల్ అసిస్టెంట్ మెహ్ఫాజ్ అలీ ఖాన్, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్ రెడ్డి, అప్పటి మైనింగ్ డిపార్ట్​మెంట్ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ గతంలోనే బెయిల్​పై విడుదలయ్యారు. తాజాగా వీరిని దోషులుగా తేల్చిన కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. 

దీంతో సీబీఐ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ ఎస్కార్ట్‌‌‌‌ తో చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలించారు. వీరికి జైలులో ఖైదీ నంబర్లను ఖరారు చేశారు. అయితే, దోషుల తరఫు  అడ్వకేట్లు హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు.  ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అధికారిని శ్రీలక్ష్మీని కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది.

2009లో కేసు నమోదు.. 

ఉమ్మడి ఏపీ అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్‌‌‌‌పై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2009లో  సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్‌‌‌‌ జోనల్‌‌‌‌ సీబీఐ కార్యాలయం అదే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌7న కేసు నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా బీవీ శ్రీనివాస్‌‌‌‌రెడ్డిని రెండవ నిందితుడిగా గాలిజనార్దన్ రెడ్డిని చేర్చింది. వీరితోపాటు సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు కృపానంద రెడ్డి, శ్రీలక్ష్మి సహా మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో సీబీఐ 2011లో మొదటి చార్జీషీట్‌‌‌‌ దాఖలు చేసింది. 

అనంతరం మరో మూడు చార్జీషీట్లు వేసింది. వీటన్నింటిపై ట్రయల్ కోర్టులో ఒకేసారి విచారణ ప్రారంభమైంది. కేసు విచారణలో ఉండగానే నిందితుడు లింగారెడ్డి మృతి చెందాడు. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మొత్తం 219 మందిని సీబీఐ కోర్టు విచారించింది. 3,337 సాక్ష్యాధారాలను పరిశీలించింది. చివరకు ఓఎంసీ కంపెనీ సహా నలుగురిని దోషులుగా నిర్ధారించి శిక్షలు ఖరారు చేసింది. అయితే, సీబీఐ కోర్టు విధించిన శిక్షలపై దోషులు నలుగురూ హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు.

నా సేవలను గుర్తించి, శిక్ష తగ్గించండి: గాలి  

తీర్పు ప్రకటించడానికి ముందు గాలి జనార్దన్ రెడ్డి సహా మిగతా దోషులను ‘చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా?’ అని జడ్జి ప్రశ్నించారు. జనార్దన్ రెడ్డి స్పందిస్తూ.. తన వయసును, తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి, శిక్షను తగ్గించాలని కోరారు. 

దీంతో ‘ఈ కేసులో పదేండ్ల శిక్ష ఎందుకు వేయకూడదు?’ అని జడ్జి ప్రశ్నించారు. తాను ఇప్పటికే నాలుగేండ్లకుపైగా సామాజిక సేవ చేస్తున్నానని, బళ్లారితో పాటు గంగావతిలో తనను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని జనార్దన్ రెడ్డి తెలిపారు. తన సేవలను గుర్తించినందుకే ప్రజలు గెలిపించారని చెప్పుకున్నారు. చివరకు ఆయనకు ఏడేండ్ల శిక్షను ఖరారు చేసినట్టు జడ్జి తీర్పును ప్రకటించారు.