
సుడిగాలి సుధీర్, గెహన సిప్పి జంటగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల రూపొందించిన చిత్రం ‘గాలోడు’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ చిత్రం గురించి సుధీర్ మాట్లాడుతూ ‘పనీ పాట లేకుండా ఊర్లో తిరిగే వ్యక్తికి సమస్యలు ఎదురవడంతో సిటీకి వస్తాడు. సిటీలోనూ మరో సమస్యలో ఇరుక్కోవడం, ఈలోపు లవ్లో పడటం, చిన్న చిన్న ట్విస్టులతో, కమర్షియల్ హంగులతో సాగే సినిమా ఇది. కొత్త కథ అని చెప్పను కానీ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలూ ఉన్న ఎంటర్టైనర్. గెహన గుడ్ కోస్టార్. రాజశేఖర్ రెడ్డి టేకింగ్, రాం ప్రసాద్ కెమెరా వర్క్, భీమ్స్ సంగీతం మెప్పిస్తాయి. మాస్ సినిమాలను మిస్ అవుతున్నామనే ప్రేక్షకుల కోసమే ఈ చిత్రం.
ఇందులో హీరోయిన్ పాత్రకు మొదట రష్మీ గౌతమ్ను అనుకున్నాం. కానీ డేట్స్ కుదరలేదు. భవిష్యత్తులో కచ్చితంగా కలిసి నటిస్తాం. హీరో అనిపించుకోవడం కంటే ఎంటర్టైనర్ అనిపించుకోవడమే ఇష్టం. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నేనలా కాదు. మ్యాజిక్ షో చేయమన్నా చేస్తా’ అన్నాడు.