హైదరాబాద్, వెలుగు: కరోనా నోడల్ సెంటర్గా ఉన్న గాంధీ హాస్పిటల్లో మంగళవారం అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది రోడ్డెక్కారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు స్టాఫ్ ఒక రోజు సమ్మెకు దిగారు. వందలాది మంది విధులు బహిష్కరించడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. పదేండ్ల క్రితం రూ.1,500 జీతంతో చేరిన తమకు ఇప్పుడు కేవలం రూ.8,500 జీతమే వస్తోందని, ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని, జీతాలు పెంచడమే కాక తమను రెగ్యులరైజ్ చేయాలని సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది, వార్డు బాయ్స్, ఆయాలు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం విధులు బహిష్కరించిన దాదాపు 500 మంది సిబ్బంది.. ఆస్పత్రి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా సిబ్బంది అంగీకరించలేదు. సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్స్ ఇవీ..
జీతాలను రూ.25 వేల వరకు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమను రెగ్యులరైజ్ చేయాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ నేరుగా ప్రభుత్వమే జీతాలివ్వాలి. పీఎఫ్ జమలో ఉన్న అవకతవకలను సరిచేయాలి. సీఎం ప్రకటించిన 10 శాతం కరోనా ఇన్సెంటివ్లు ఇవ్వాలి. వారం రోజులు వరుసగా డ్యూటీ చేసిన సిబ్బందికి వారం సెలవు ఇవ్వాలి. సిబ్బందిపై పనిభారం పెరిగిన కారణంగా ఖాళీగా ఉన్న చోట్ల కొత్త వారిని నియమించాలి. కరోనా వార్డుల్లో డ్యూటీలు చేస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్లు, శానిటైజర్స్ ఇవ్వాలి.
ఇవాళ కొనసాగనున్న గాంధీ సిబ్బంది సమ్మె
ఒకరోజు సమ్మెకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కొనసాగించాలని గాంధీ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డిని గాంధీ సిబ్బంది తరఫున ఆయా కార్మిక సంఘాల నేతలు కలసి వారి సమస్యలను వివరించనున్నారు.
ఇదేనా ప్రతిఫలం?
కరోనా వార్డుల్లో రిస్క్ తో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి అతి తక్కువ జీతాలివ్వడం సరికాదని గాంధీ ఆస్పత్రి సీఐటీయూ నేత లక్ష్మీపతి అన్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సర్కార్కు ఉన్న శ్రద్ధలో కొంతైనా గాంధీ సిబ్బందిపై పెట్టాలని సీఎంను కోరారు. ఇంట్లో వద్దని చెబుతున్నా ప్రాణాలను పణంగా పెట్టి రోజు డ్యూటీలు చేస్తున్నామని, రూ.8,500 జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని గాంధీ శానిటేషన్ వర్కర్ లక్ష్మీ ప్రశ్నించింది.
ఐదో రోజుకు ఔట్ సోర్సింగ్ నర్సుల సమ్మె
చాలీచాలని జీతాలతో బతుకులు ఈడ్చుకొస్తున్నామని, ఇప్పటికైనా తమపై దయతలచాలని గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ జీతాలను రూ.35 వేలకు పెంచాలని, జాబ్స్ను రెగ్యులరైజ్ చేయాలంటూ వారు చేపటట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఐదో రోజుకు చేరింది.
మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి
గాంధీ ఆస్పత్రిలో కొన్నేండ్లుగా తక్కువ జీతాలతో, అభద్రతాభావంతో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఔట్సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది మంగళవారం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు వినతిపత్రం ఇచ్చారు. గాంధీలో 42 మంది పారా మెడికల్, 35 మంది కంప్యూటర్ ఆపరేటర్స్ ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారన్నారు. కరోనా టైంలో చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, జీతం రూ.30 వేలకు పెంచాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి ఈటలకు లేఖలు పంపారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడిగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.