
కౌలాలంపూర్: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేసియా మాస్టర్స్ టోర్నీలో రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ 15వ ర్యాంకర్ సింధు 21–16, 5–21, 16–21తో వరల్డ్ ఏడో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడింది. ఏడాది తర్వాత బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో ఫైనల్ ఆడిన తెలుగమ్మాయి వరుస విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె ఉన్న ఫామ్ను చూసి టైటిల్ కూడా గెలుస్తుందని భావించారు. అదే రీతిలో నిర్ణయాత్మక మూడో గేమ్లో 11–3 ఆధిక్యంలోనూ నిలిచింది. కానీ ఇక్కడే సింధు అనూహ్యంగా తడబడింది. ఎండ్లు మారిన తర్వాత వరుస తప్పిదాలు చేస్తూ పాయింట్లు సమర్పించుకుంది. దాంతో వాంగ్ ఈజీగా మ్యాచ్ను చేజిక్కించుకుంది. గంటా 19 నిమిషాల మ్యాచ్లో సింధు స్టార్టింగ్లో పదునైన స్మాష్లు, ర్యాలీలతో చెలరేగింది. దీంతో తొలి గేమ్లో 6–6తో స్కోరు సమమైన తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
కానీ రెండో గేమ్లో పుంజుకున్న వాంగ్ క్రాస్ కోర్టు ర్యాలీస్తో చెలరేగింది. 1–1 స్కోరు వద్ద నుంచి వరుసగా 4, 5, 10 పాయింట్లతో గేమ్ నెగ్గి మ్యాచ్లో నిలిచింది. డిసైడర్లో మాత్రం చివర్లో తన ట్రేడ్ మార్క్ షాట్లతో సింధుకు చెక్ పెట్టింది.