కుక్కల దాడిలో రెండు చుక్కల దుప్పులు మృతి

కుక్కల దాడిలో రెండు చుక్కల దుప్పులు మృతి
  • వేర్వేరు చోట్ల ఘటనలు

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్​లో వన్యప్రాణుల మృత్యువాత కొనసాగుతూనే ఉంది. శనివారం కౌటాలలో ఓ చుక్కల దుప్పి చనిపోగా అటవీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. కౌటాల మండల కేంద్రంలోని హై స్కూల్ ప్రాంతంలో చుక్కల దుప్పి చనిపోగా గుట్టుచప్పుడు కాకుండా అటవీ అధికారులు ఖననం చేశారు. 

ఆ నోటా ఈ నోట ఈ విషయం బయటపడడంతో కుక్కలు దాడి చేయడంతో దుప్పి చనిపోయిందని ఫారెస్ట్ అధికారులు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే కాగజ్ నగర్ రేంజ్ పరిధిలోని కడంబ అడవిలో కుక్కల దాడిలో మరో చుక్కల దుప్పి మృతి చెందింది. ఆదివారం ఉదయం దుప్పి చనిపోయినట్లుగుర్తించిన అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని దాన్ని ఖననం చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమాదేవి తెలిపారు.