సికింద్రాబాద్, వెలుగు: గణనాథుల శోభాయాత్ర రాచకొండ పరిధిలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నెమ్మదిగా సాగగా.. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి వేగం పెరిగి అర్ధరాత్రి వరకు కొనసాగింది. ట్రాఫిక్ కంట్రోల్కు పోలీసులు ప్యారడైజ్వద్ద వన్ వే ఏర్పాటు చేశారు. ప్యాట్నీ సెంటర్, సీటీసీ రోడ్లను మూసివేశారు. ట్యాంక్బండ్ నుంచి సికింద్రాబాద్వైపు వచ్చే వాహనాలను ఒక వైపు నుంచి అనుమతించారు. మల్కాజిగిరి సఫిల్గూడ మినీ ట్యాంక్బండ్ వద్ద గణనాథుల నిమజ్జనం రాత్రి 7గంటల తర్వాత మొదలైంది. సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్లోనూ విగ్రహాల నిమజ్జనం కొలాహలంగా సాగింది.
జేబీఎస్కు వెళ్లే బస్సులు దారి మళ్లింపు..
జిల్లాల నుంచి ట్యాంక్బండ్మీదుగా ఎంజీబీఎస్కు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. కరీంనగర్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్వైఎంసీఏ, సంగీత్ క్రాస్రోడ్స్, తార్నాక, జామై ఉస్మానియా, నింబోలి అడ్డా, చాదర్ ఘాట్ మీదుగా వెళ్లాయి. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ క్రాస్రోడ్స్, చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, ఐఎస్సదన్, నల్గొండ క్రాస్రోడ్స్, చాదర్ఘాట్మీదుగా నడిపారు. ముంబై వైపు నుంచి వచ్చే బస్సులు గోద్రేజ్ వై జంక్షన్, నర్సాపూర్ క్రాస్రోడ్స్, బోయిన్పల్లి, జేబీఎస్, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జామై ఉస్మానియా మీదుగా మళ్లించారు. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు డైవర్షన్ ఉంటుందని, ఆ తర్వాత పాత రూట్లలోనే బస్సులు నడుస్తాయని ఆర్టీసీ తెలిపింది.