హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్ ఘటన మరువక ముందే హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని సంతోష్ నగర్ పోలీసులకు బుధవారం ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఫిర్యాదు చేసింది. మిధాని పిసల్ బండకు చెందిన యువతి(20)సంతోనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి బయల్దేరింది. సంతోష్ నగర్లో షేరింగ్ ఆటో ఎక్కింది. ఆటోలో అప్పటికే ఓ మహిళ ఉండటం గమనించింది. ప్రయాణిస్తున్న టైమ్లో నిద్ర మత్తులోకి వెళ్లింది. తనతో ట్రావెల్ చేస్తున్న మహిళ మధ్యలో దిగిపోవడంతో ఒంటరిగా ఉన్న యువతి గురించి ఆటో డ్రైవర్ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పాడు. తర్వాత మరో ఇద్దరు ఆటో ఎక్కారు. మిధాని పిసల్ బండ ప్రాంతంలో ఆటోను ఆపకుండా బాలాపూర్ పీఎస్ లిమిట్స్లోని షాహిన్ నగర్కి తీసుకెళ్లారు. ముగ్గురు కలిసి యువతిని గ్యాంగ్ రేప్ చేశారు.
సీసీటీవీ ఫుటేజీ కలెక్ట్ చేసిన పోలీసులు
అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న యువతి.. ముగ్గురు ఆటోడ్రైవర్లు తనపై అత్యాచారం చేశారని తల్లికి చెప్పింది. బుధవారం ఉదయం తల్లితో పాటు వచ్చి సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురును కిడ్నాప్ చేసి, బెదిరించి అత్యాచారం చేశారని ఫిర్యాదులో తల్లి పేర్కొంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని భరోసా సెంటర్కి తరలించి వైద్య పరీక్షలు చేశారు. సంతోష్ నగర్ నుంచి షాహీన్ నగర్ వరకు సీసీ ఫుటేజీని కలెక్ట్ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్తున్న వివరాలకు, సీన్ ఆఫ్ అఫెన్స్కు సంబంధం లేకపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు.