లా స్టూడెంట్‎పై గ్యాంగ్ రేప్ నిజమే.. బాధితురాలి మెడ, ఛాతిపై కమిలిన చర్మం: వైద్య పరీక్షల రిపోర్ట్

లా స్టూడెంట్‎పై గ్యాంగ్ రేప్ నిజమే.. బాధితురాలి మెడ, ఛాతిపై కమిలిన చర్మం: వైద్య పరీక్షల రిపోర్ట్
  • బాధితురాలి మెడ, ఛాతిపై కమిలిన చర్మం
  • బాధితురాలి తలపై హాకీ స్టిక్ తో కొట్టిన గాయం 
  • లా కాలేజీ సెక్యూరిటీ గార్డ్ అరెస్టు 
  • ఫ్రెండ్​ను ఫ్రెండే రేప్ చేస్తే ఏం చేయగలం: టీఎంసీ ఎంపీ
  • టీఎంసీ ఎంపీ రేపిస్టులకు సపోర్టు చేస్తున్నడు: సువేందు అధికారి
  • రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత: ‘ఆర్జీకర్’ బాధితురాలి తండ్రి

కోల్​కతా(బెంగాల్): కోల్‎కతా లా కాలేజీ స్టూడెంట్‎పై​గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు వెద్యపరీక్షలు స్పష్టం చేస్తున్నాయి. సామూహిక అత్యాచారానికి సంబంధించిన పలు గుర్తులు శరీరంపై కనిపిస్తున్నాయని తెలిసింది. స్టూడెంట్ మెడ, ఛాతిపై చర్మం ఒరుసుకుపోయి కమిలి పోయినట్టు టెస్టుల్లో వెల్లడైంది. 

అలాగే బాధితురాలి తలపై హాకీ స్టిక్​తో కొట్టినట్టు కూడా మెడికల్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ముఖం, ఇతర అవయవాలపై బయటకు కనిపించే గాయాలు లేనప్పటికీ.. గ్యాంగ్​రేప్ జరిగినట్టు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్ధారించినట్టు సమాచారం. సేకరించిన మూడు స్వాబ్‎లను ఫోరెన్సిక్ టెస్టులకు పంపించారు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టు మాత్రం నెగెటివ్ వచ్చిందని తెలిసింది.

సిట్ ఏర్పాటు.. గార్డ్ అరెస్టు 

అసిస్టెంట్ కమిషనర్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ​టీమ్(సిట్)​ఈ కేసును ఎంక్వైరీ చేస్తున్నట్టు బెంగాల్​ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత మనోజిత్, మరో ఇద్దరు లా స్టూడెంట్లను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. శనివారం కాలేజీ సెక్యూరిటీ గార్డ్‎ను కూడా అరెస్టు చేశారు. తనకు సాయం చేయకుండా గార్డ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

కాలేజీలో పోలీసులు ఉంటారా..?

గ్యాంగ్​రేప్ ఘటనపై టీఎంసీ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘స్నేహితుడే అత్యాచారం చేస్తే ఏం చేయగలం, ఎలా రక్షించగలం..? కాలేజీలో, క్యాంపస్‎లో పోలీసులు ఉంటారా..? పురుషుల మనస్తత్వం ఇలా ఉన్నన్ని రోజులు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. వక్రబుద్ధి కలిగిన పురుషులతో మహిళలు పోరాడాలి’’ అని ఆయన కల్యాణ్ ​బెనర్జీ సూచించారు. 

టీఎంసీ ఎంపీ చేసిన కామెంట్లపై బీజేపీ మండిపడింది. అధికార పార్టీ తన బాధ్యత నుంచి తప్పించుకునేలా వ్యవహరిస్తోందని విమర్శించింది. రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ ‘‘టీఎంసీ ఎంపీ రేపిస్టులకు సపోర్ట్‎గా మాట్లాడుతున్నరు. మహిళల భద్రతను రాజకీయ అజెండాగా మార్చారు. ఆ పార్టీ నేతల ఇలాంటి తీరు వల్లే బెంగాల్‌‎లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది’’ అని విమర్శించారు.

ఈ దారుణాలు ఆగేదెన్నడు..?: ‘ఆర్జీ కర్’ బాధితురాలి తండ్రి

లా కాలేజీలో గ్యాంగ్‌‌‌‌రేప్ ఘటనకు బెంగాల్​రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ రేప్, మర్డర్ బాధితురాలి తండ్రి అన్నారు. ‘‘నా కూతురికి జరిగిన దారుణం తర్వాత చాలామంది రోడ్డెక్కి నిరసనలు చేశారు. అయినప్పటికీ, ఈ దారుణాలు ఆగడంలేదు. ఈ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత. ప్రస్తుత రేప్ ​కేసులో నిందితులు ముగ్గురూ టీఎంసీ వాళ్లే, కనుక ఆ రాజకీయ పార్టే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి’’ అని ఆయన డిమాండ్​ చేశారు.