న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన సంగతి తెలిసిందే. దూబే గురించి అతడి భార్య రిచా దూబే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వికాస్ చేసే పనుల గురించి తనకు కొంచెం మాత్రమే తెలుసునని ఆమె పేర్కొంది. దూబే చేసిన దానికి ఆయనను ఎవరూ క్షమించరని చెప్పింది. కాన్పూర్లో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన తన భర్త వికాస్ను తానే చంపేదాణ్నని పేర్కొంది.
‘ఎనిమిది మంది పోలీసు కుటుంబాలను ఆయన నాశనం చేశాడు. ప్రజలకు మా ముఖాలను చూపించలేకపోతున్నాం. ఆయనను నేనే చంపేసే దాణ్ని. నేను కేవలం నా ఫ్యామిలీ గురించే ఆలోచిస్తున్నా. నా కుటుంబం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ దక్కదని తెలుసు. వికాస్కు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన బ్రెయిన్లో ఓ బబుల్ డెవలప్ అయింది. దీని వల్ల ఆయన యాంక్జైటీ డిజార్డర్కు గురయ్యారు. ఫలితంగా ఆయనకు చాలా కోపం వస్తుండేది. దీనికి సంబంధించి ఆయనకు ట్రీట్మెంట్ కూడా జరిగింది. కానీ గత 3–4 నెలలుగా ట్రీట్మెంట్ ఆగిపోయింది. దీంతో ఆయనకు కోపం మరింత ఎక్కువైంది’ అని రిచా వివరించింది.
