హైదరాబాద్ సిటీలో కొత్త దందా.. బ్లాక్ మార్కెట్కు ఇంటి సిలిండర్లు.. డెలివరీ చేయకున్నా చేసినట్టు మెసేజ్లు

హైదరాబాద్ సిటీలో కొత్త దందా.. బ్లాక్ మార్కెట్కు ఇంటి సిలిండర్లు.. డెలివరీ చేయకున్నా చేసినట్టు మెసేజ్లు
  • హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్​సెంటర్లకు అమ్మకం  
  • ఒక్క సిలిండర్​ రూ.3 వేల నుంచి రూ.4 వేలు
  • తామేం చేయలేమంటున్న సివిల్ ​సప్లయీస్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి. కొందరు గ్యాస్​ ఏజెన్సీల నిర్వాహకుల సహకారంతోనే గృహ అవసరాలకు వాడాల్సిన సిలిండర్లను హోటల్స్​, టిఫిన్​ సెంటర్లు, రెస్టారెంట్లకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం కమర్షియల్​సిలిండర్ల సరఫరాను ఆయిల్​ కంపెనీలు నిలిపివేయడంతో హోటల్స్, టిఫిన్​ సెంటర్ల నిర్వాహకులు డొమెస్టిక్​ సిలిండర్లపై పడ్డారు.

రూ.3 వేల నుంచి రూ.4 వరకు రేటు పలుకుతున్నా ఎగబడి మరీ కొంటున్నారు. దీంతో కొందరు ఏజెన్సీల నిర్వాహకులు, డెలివరీ బాయ్స్​కలిసి బ్లాక్​చేస్తూ సంపాదిస్తున్నారు. కస్టమర్లు బుక్​చేసిన సిలిండర్లను వారు ఓటీపీ చెప్పకపోయినా డెలివరీ చేసినట్టు చూపి అమ్ముకుంటున్నారు. 

డెలివరీ కాకున్నా అయినట్టు మెసేజ్లు
నగరంలోని చాలా మందికి సిలిండర్లు డెలివరీ కాకపోయినా అయినట్టు మెసేజ్ లు వస్తున్నాయి.  సిలిండర్​బుక్​చేయకపోయినా చేసినట్టు..డెలివరీ అయినట్టు కూడా మెసేజ్​లు వస్తున్నాయి.  సికింద్రాబాద్​లోని రాజేంద్రనాధ్​అనే కస్టమర్​తాను సిలిండర్​ బుక్​ చేయలేదని, అయినా బుక్​చేసినట్టు డెలివరీ అయినట్టు మెసేజ్​వచ్చిందని వాపోయాడు.

వారాసిగూడలోని మరో వినియోగ దారుడు తాను సిలిండర్​బుక్​చేసి వారమైందని, సిలిండర్​రాలేదని, కానీ డెలివరీ అయినట్టు మెసేజ్​వచ్చిందని చెప్పాడు. ఇలా నగరంలోని చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు ఏజెన్సీల వారే డెలివరీ బాయ్స్​ద్వారా ఒక్కో సిలిండర్​ను 3వేల నుంచి 4వేలకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

రోజూ 75 లక్షల బుకింగ్స్​
గ్రేటర్​ పరిధిలో 30 లక్షల గ్యాస్​కనెక్షన్లు ఉండగా, సాధారణ రోజుల్లో 50 లక్షల వరకూ బుకింగ్​లు జరుగుతాయని, డెలివరీలు 25 నుంచి 30 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. కానీ, ప్రస్తుతం రోజుకు 75 లక్షల వరకు బుకింగ్​లు అవుతుండగా డెలివరీలు కూడా 40 లక్షల వరకు ఉన్నాయంటున్నారు. 

అయితే ఇందులో సగం కస్టమర్లకు చేరకుండా పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. విషయాన్ని హైదరాబాద్ ​జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్​దృష్టికి తీసుకువెళ్లగా అవి ఆయిల్​కంపెనీలు చూసుకుంటాయని, తామేం చేయలేమని స్పష్టం చేశారు.

38 గ్యాస్​ సిలిండర్లు సీజ్
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గృహ వినియోగ గ్యాస్‌‌‌‌‌‌‌‌ను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్న వ్యాపార సముదాయాలపై బాలానగర్ సివిల్ సప్లయ్ శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. 38 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.