- హాజరైన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్
గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఐటీ కారిడార్ లోని పలు ప్రాంతాలు నీటమునిగి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ సమస్యపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అన్నీ శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు.
దీంతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అధ్యక్షతన డీజీపీ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, సైబరాబాద్సీపీ రమేశ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీఎంసీ, ఇరిగేషన్, హైడ్రా, ఇంజినీరింగ్శాఖల ఉన్నతాధికారులు మంగళవారం ఐటీ కారిడార్లో పర్యటించారు.
రాయదుర్గం మల్కం చెరువు వద్ద షేక్పేట్ రహదారిపై వరద నిలిచే ప్రాంతాన్ని, ఆ తర్వాత గచ్చిబౌలి ఎలక్షన్ ఆఫీస్ వద్ద ఉన్న ఖాజాగూడ చెరువుకు వెళ్లే నాలాను, కొండాపూర్లోని సంతోష్ దాబా వద్ద నాలాను పరిశీలించారు. వర్షపునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఖానామేట్ మొండికుంటను సందర్శించారు. అక్కడి నుంచి మియాపూర్ గురునాథం చెరువు వద్దకు చేరుకొని జేపీనగర్నుంచి వచ్చే నాలాను తనిఖీ చేశారు. అంతకుముందు మల్కం చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో డీజీపీ ఆనంద్మాట్లాడారు.
నగరంలోని లోతట్టు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీస్సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఐటీ కారిడార్లో వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖలు సమష్టిగా పనిచేసి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
