- సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వ దృష్టిలో ‘జీడీపీ’ అంటే కేవలం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాదని, గ్రాస్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ (జీఈపీ) అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భారత్ 15 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే ప్రయాణంలో తెలంగాణను కీలక భాగస్వామిగా మార్చుతామన్నారు.
శుక్రవారం బేగంపేట్లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్బన్ ఇంజన్, ఇండస్ట్రియల్ హార్ట్ ల్యాండ్, రూరల్ ట్రాన్ఫ్సర్మేషన్ జోన్ అనే మూడు మూల స్తంభాలుగా తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని వివరించారు.
ఇందుకోసం అమలులో వేగం, అవకాశాలలో పారదర్శకత, రూపకల్పనలో ‘ఫ్యూచర్-రెడీ’గా ఉండే కొత్త అభివృద్ధి నమూనాకు రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తున్నామన్నారు. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 350 బిలియన్ డాలర్లకు చేరేలా సర్వీసెస్, సస్టైనబిలిటీ, స్మార్ట్ లివింగ్కు గ్లోబల్ క్యాపిటల్, నెట్-జీరో ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని కీలకమైన పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రతి రైతును పారిశ్రామికవేత్తగా మార్చేలా అగ్రి-ప్రాసెసింగ్ క్లస్టర్లు, డిజిటల్-అనుసంధానం కలిగిన ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘ఏఐ ఇన్నొవేషన్ హబ్, ఏఐ సిటీ, ఇమేజ్ టవర్స్, టీ-హబ్ ఫేజ్ 2 ద్వారా రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత పటిష్ఠమవుతోంది. రాష్ట్రంలో 2030 నాటికి 20 గిగావాట్స్ పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్లోబల్గా పోటీపడేలా ‘మేక్ -ఇన్ -సౌత్, స్కేల్ -ఫర్- ది- వరల్డ్’ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి పని చేయాలి”అని ఆయన పిలుపునిచ్చారు.
