ఇల్లంతకుంట: నాపై నమ్మకముంచి హుజురాబాద్ టికెట్ కేటాయించిన సీఎంకు పాదాభివందనాలు అన్నారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఇల్లంతకుంటలో బుధవారం టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరై మాట్లాడారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు శ్రీనివాస్ యాదవ్ పాదాభివందనాలు అన్నారు. నన్ను గెలిపించే బాధ్యతను సీఎం కేసీఆర్.. హరీశ్ రావు చేతిలో పెట్టారని తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం ఇచ్చారని.. విద్యార్థి నేతగా ఉద్యమాల్లో పాల్గొన్నానన్నారు. దళిత, బహుజన విద్యార్థుల హక్కుల కోసం పోరాడానని.. పార్టీ కోసం తాను చేసిన సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. విద్యార్థి ఉద్యమంలో పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జైలుకు వెళ్లానన్న శ్రీనివాస్...
తనపై టికెట్ ఇచ్చిన కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తా అన్నారు.
నాకు ఆస్తులు లేవని.. ముత్తాత నుంచి వచ్చిన 2 గుంటల భూమి మాత్రమే ఉందన్నారు. తనను గెలిపిస్తే మీ పని మనిషిలా సేవ చేసుకుంటానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.