
ఏఐ అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ఎన్నో భయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కానీ.. ఏఐ వల్ల బోలెడన్ని లాభాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఘోస్ట్ నెట్లను గుర్తించే టెక్నాలజీ.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిషింగ్ పరికరాల్లో 20 శాతం అదృశ్యమవుతున్నాయి. అవన్నీ సముద్ర గర్భంలోకి వెళ్తున్నాయి. అలా ఏటా 50,000 టన్నుల చేపలు పట్టే వలలు చేరుతున్నాయి. సముద్రాల్లోని మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో దాదాపు 30 శాతం అవే ఉన్నాయి. శతాబ్దాలపాటు అందులోనే ఉండడం వల్ల విచ్ఛిన్నమై మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం ఏర్పడుతుంది.
►ALSO READ | కాస్మిక్స్ బ్రాండ్ ..నెలకు రూ.6 కోట్ల ఆదాయం
అంతేకాదు.. విచ్ఛిన్నం కాని వలలు చేపలు, సముద్ర పక్షులు, తాబేళ్లు, సముద్ర క్షీరదాలకు ఉచ్చులుగా మారి ప్రాణాలు తీస్తున్నాయి. అందుకే అలాంటి వలలను సముద్రం నుంచి వెలికి తీసేందుకు జర్మనీకి చెందిన పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘డబ్ల్యూడబ్ల్యూఎఫ్’ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఏఐ టెక్నాలజీ సాయంతో ఘోస్ట్ నెట్లను గుర్తిస్తోంది. అందుకోసం మైక్రోసాఫ్ట్ సాయం తీసుకుని ఏఐ సపోర్ట్తో పనిచేసే ప్లాట్ఫామ్ ghostnetzero.aiని తీసుకొచ్చింది. ఇది సోనార్ చిత్రాల ఆధారంగా ఘోస్ట్ నెట్లను సమర్థవంతంగా గుర్తిస్తోంది. ఈ టెక్నాలజీ ఇప్పటికే 90 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది.