
ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టయిల్లో ఎంతోమంది ఆడవాళ్లు పీసీవోఎస్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. విభా హరీష్ అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంది. మెడిసిన్ వాడినప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగినా మళ్లీ మళ్లీ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. తనలా ఇంకెవరూ బాధపడకూడదని పీసీవోఎస్కి మూల కారణాలు ఏంటి? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాలపై రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ ఫలితమే కాస్మిక్స్ బ్రాండ్ పేరుతో ఆమె తీసుకొచ్చిన ప్రొటీన్ సప్లిమెంట్లు. ఒక చిన్న ప్లాంట్లో మొదలైన ఈ స్టార్టప్కు ఇప్పుడు నెలకు రూ. 6 కోట్ల ఆదాయం వస్తోంది.
కర్నాటకలోని బెంగళూరుకి చెందిన విభా హరీష్కు 2016లో పీసీవోఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా స్వల్పకాలిక పరిష్కారం మాత్రమే దొరికింది. దాంతో విసుగు చెంది.. సమస్యకు మూల కారణాలను తెలుసుకుంది. ఆ తర్వాత ఎంతో రీసెర్చ్ చేసి పీసీవోఎస్ లాంటివాటిని దరిచేరనీయకుండా కాపాడే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ని తానే స్వయంగా తయారుచేసుకుంది. అంతేకాదు.. తనలా హార్మోనల్ డిజార్డర్లతో పోరాడుతున్న ఎంతోమందికి సాయం చేయాలనుకుంది. ఇండియన్ నేవీలో పనిచేస్తున్న భర్త సూర్య కూడా ఆమెకు సపోర్ట్ చేశాడు. దాంతో స్వచ్ఛమైన పోషకాహారాన్ని అందించే వెల్నెస్ బ్రాండ్ ‘కాస్మిక్స్’కు పునాదిపడింది.
బెస్ట్ రిజల్ట్స్ కోసమే
విభా దాదాపు మూడేళ్లపాటు ఎన్నో రీసెర్చ్లు చేసి చివరకు 2019 డిసెంబర్లో ‘కాస్మిక్స్’ పెట్టింది. ‘‘మా జర్నీ మొదలుపెట్టినప్పుడు ప్రొటీన్ సప్లిమెంట్ తయారుచేయాలని అనుకోలేదు. అజీర్ణం, నిద్రలేమి, ఒత్తిడి, రోగనిరోధక శక్తి లేకపోవడం లాంటి సమస్యల నుంచి బయటపడేసే హోమ్ రెమెడీస్ని అందరికీ అందించాలి అనుకున్నాం. ముఖ్యంగా జీలకర్ర, అల్లం, అశ్వగంధ లాంటి వంటింట్లో ఉన్న ఔషధాలతో ప్రొడక్ట్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ.. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే ప్రొటీన్ సప్లిమెంట్ అవసరమని తెలుసుకున్నాం. అందుకే ఆ దిశగా దృష్టి పెట్టాం. ఆ తర్వాత కొన్నాళ్లకు మా టీంతో కలిసి కొన్ని గట్-ఫ్రెండ్లీ, ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ సప్లిమెంట్స్ని తయారుచేశాం. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాటికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. రుచి కోసం వాటిలో ఎలాంటి ఎమల్సిఫైయర్లు, బల్కింగ్ ఏజెంట్లను ఉపయోగించడంలేదు. అందుకే అవి టేస్టీగా ఉండవు. హెల్త్ మీద అవగాహన ఉన్నవాళ్లు, ప్రొడక్ట్స్ గురించి అర్థం చేసుకున్నవాళ్లు మాత్రమే కొంటున్నారు” అని చెప్పుకొచ్చింది విభా. ఆమె ఈ సప్లిమెంట్లకు కావాల్సిన ఇంగ్రెడియెంట్స్ని సేకరించడం దగ్గర నుంచి వాటిని తయారుచేశాక ప్యాక్ చేసేవరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంగ్రెడియెంట్స్ని రైతుల నుంచే నేరుగా సేకరిస్తారు. ఆ తర్వాత ప్రాసెస్ చేసి గాజు జాడిలో ప్యాక్ చేసి, బయోడిగ్రేడబుల్ స్కూప్లతో ఇస్తారు. ఇలా ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ చేయడం వల్లే కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్మించగలిగారు.
చిన్నగా మొదలై..
కాస్మిక్స్ చాలా చిన్నగా మొదలైంది. ఫార్ములేషన్ ఎక్స్పర్ట్స్, మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, వేర్ హౌజ్లో కొంతమంది ఉద్యోగులతో దీన్ని ప్రారంభించారు. ఆమె భర్త సూర్య ఉద్యోగం చేస్తూనే ప్రతిరోజూ విభాతో మాట్లాడి, సలహాలు ఇచ్చేవాడు. కొన్నాళ్లకు రోల్స్ రాయిస్లో తన ఉద్యోగాన్ని వదిలి బ్రాండ్ కోసం పూర్తి టైం కేటాయించింది విభా. “మా ప్రధాన లక్ష్యం నమ్మకమైన ప్రొడక్ట్స్ని తయారుచేయడమే. అందుకే గ్రాడ్యుయల్ గ్రోత్ని కోరుకోలేదు. మా ప్రొడక్ట్స్ వాడిన ప్రజలే మరికొందరికి చెప్పి, సేల్స్ పెరిగేలా చేశారు. అందుకే సేల్స్ ఆర్గానిక్గా పెరుగుతూ వచ్చాయి. దాంతో 2021 నుంచి సూర్య కూడా కంపెనీ కోసం ఫుల్ టైం పనిచేస్తున్నాడు” అంటోంది విభా.
ప్లాస్టిక్ ఫ్రీ..
ప్రపంచంలోని ప్లాస్టిక్ వేస్ట్లో 40శాతం ప్యాకేజింగ్ వల్లే ఉత్పత్తి అవుతుంది. అందుకే విభా ప్లాస్టిక్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్యాకేజింగ్ కోసం గాజు సీసాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్తో పోలిస్తే.. వీటి ధర చాలా ఎక్కువ అయినప్పటికీ కాంప్రమైజ్ కావడంలేదు. సహజంగా నేలలో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ స్కూప్లను ప్యాక్లో ఇస్తున్నారు. వాటిని పొట్టు, స్టార్చ్ను ఉపయోగించి తయారుచేస్తారు.
కంపెనీ డెవలప్మెంట్
ఈ స్టార్టప్ పెట్టిన కొన్ని నెలల్లోనే కరోనా మహమ్మారి వచ్చింది. ఆ టైంలో ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహన బాగా పెరిగింది. దాంతో కాస్మిక్స్ ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరిగింది. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా ‘మై హ్యాపీ గట్, స్లీప్ లైక్ ఎ బేబీ’ ప్రొడక్ట్స్కి సేల్స్ బాగా పెరిగాయి. వీటితో చాలా రకాల ప్రొటీన్ పౌడర్లు, బార్లు అమ్ముతున్నారు. విభా, సూర్య మరికొన్ని రోజుల్లో తమ ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఈ స్టార్టప్ ఆదాయం రూ. 60 కోట్లు దాటింది. ప్రస్తుతం నెలకు రూ. 6 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. స్టార్టప్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, సోషల్ మీడియా, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లలో మొత్తంగా 95 మందికి పైగా పనిచేస్తున్నారు.
రైతుల నుంచే..
‘‘ఇతర ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్లతో పోలిస్తే మాది చాలా ప్రత్యేకమైనది. మా సప్లిమెంట్లో అలెర్జీకి కారణమయ్యేవి ఏవీ ఉండవు. కొన్ని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లు కడుపు ఉబ్బరానికి దారితీస్తాయి. కానీ.. మా ఫార్ములాలో సోంపు, అల్లం లాంటివి ఉండడం వల్ల ఈజీగా జీర్ణం అవుతుంది. అవి గట్ హెల్త్ని కూడా కాపాడతాయి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని అస్సలు వాడము. ఇండోనేషియా కోకో, కేరళ వనిలా బీన్ పౌడర్ లాంటి వాటినే వాడతాం. మేం వాడే ప్రతి ఇంగ్రెడియెంట్ని రైతుల నుంచే సేకరిస్తాం. ఉదాహరణకు.. కర్నాటకలోని గడగ్ నుంచి అశ్వగంధను సేకరిస్తాం. అక్కడి రైతులు మా కోసమే ప్రత్యేకంగా పండిస్తారు. ఎండబెట్టి, పొడి చేసి, మా ఫార్ములేషన్లకు సరిపోయేవిధంగా మార్చి ఇస్తారు. ఆ తర్వాత అశ్వగంధను జీరా, మెంతులు లాంటి ఇతర ఇంగ్రెడియెంట్స్తో కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేస్తాం. తీపి కోసం మాంక్ ఫ్రూట్నే మాత్రమే వాడతాం. కాఫీ బీన్స్ని చిక్మగళూరు నుంచి తీసుకొస్తాం. అక్కడి రైతుల నుంచి బీన్స్ కొన్న తర్వాత, క్వాలిటీ చెక్ చేసి వాటిని పొడి చేస్తాం. తర్వాత బటానీ, రైస్ ప్రొటీన్ ఐసోలేట్లు, కొబ్బరి పాల పొడి, అల్లం కలుపుతాం. తయారీలో ఎటువంటి రసాయనాలు వాడకుండా సాధ్యమైనంత వరకు సహజ పద్ధతులు పాటిస్తాం. అంతేకాదు.. ప్రతి బ్యాచ్ క్వాలిటీ, ప్యూరిటీ, కాంపోజిషన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తాం. ప్రొడక్ట్స్లో మెటల్స్, బ్యాక్టీరియా లాంటివి లేవని నిర్ధారించుకున్నాక ఎఫ్ఎస్ఎస్ఏఐ -(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-), ఎన్ఏబీఎల్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్) ఆమోదించిన థర్డ్ పార్టీ ల్యాబ్కు పంపిస్తాం. అక్కడ అన్ని రకాల టెస్ట్లు పూర్తయ్యాక మార్కెట్లో అమ్ముతాం” అని చెప్పుకొచ్చింది విభా.
పెద్ద సమస్యే
పన్నెండు సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న నోయిడాకు చెందిన గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ నిధి త్రిపాఠి ‘‘పీసీవోఎస్ ముఖ్యంగా మెటబాలిజంని ప్రభావితం చేస్తుంది. మధుమేహం, ఊబకాయంతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. పరోక్షంగా ఇన్ఫ్లమేషన్కు ఇదే కారణం. అందుకే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. అల్లం, పసుపు, మెంతులు లాంటివి రెగ్యులర్గా ఫుడ్లో ఉండేలా చూసుకోవాలి. నా పేషెంట్లలో చాలామంది ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ తీసుకుని, ఇలాంటి సమస్యలకు దూరమవడం గమనించా. ముఖ్యంగా కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడంలో ఈ ప్రొటీన్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే వాళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారు’’అని చెప్పుకొచ్చారు.
►ALSO READ | స్మార్ట్ ఫోన్ వచ్చాకే స్విగ్గీ, జొమాటో వచ్చిందనుకుంటున్నారా..? కాదు 90 ఏండ్ల క్రితమే ఫుడ్ డెలివరీ..!