
స్మార్ట్ ఫోన్ వచ్చాకే స్విగ్గీ, జొమాటో లాంటి యాప్ల వల్ల ఫుడ్ డెలివరీ మొదలైందని అందరూ అనుకుంటారు. కానీ.. జపాన్ రాజధాని టోక్యోలో అవేవీ లేని టైంలోనే ఈ ట్రెండ్ మొదలైంది.
1935లోనే టోక్యోలో ‘‘డెమీ డెలివరీ’’ పేరుతో ఈ సర్వీసులు అందించారు. రెస్టారెంట్లు.. ముఖ్యంగా నూడుల్స్ షాపుల నుంచి వేడి వేడి ఫుడ్ని నేరుగా ఇళ్లకు, ఆఫీసులకు చేర్చేవాళ్లు. కొన్ని రోజుల్లోనే ఈ సర్వీసు టోక్యోలో బాగా ఫేమస్ అయింది. సిటీలోని యువకులు, నూడుల్స్ షాపుల్లోని అప్రెంటిస్లు డెలివరీ బాయ్స్గా పని చేసేవాళ్లు. ఇప్పటిలానే అప్పట్లో కూడా నిమిషాల్లోనే నూడుల్స్ డెలివరీ చేసేవాళ్లు. అందుకోసం సైకిళ్లను వాడేవాళ్లు. చెక్కలతో చేసిన ట్రేలు, బుట్టలో ఫుడ్ పెట్టుకుని తీసుకెళ్లేవాళ్లు. వీళ్లని ‘నూడుల్స్ బాయ్స్’ అని కూడా పిలిచేవాళ్లు.
డెమీ డెలివరీ బాయ్స్కి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే డజన్ల కొద్దీ ఫుడ్ ట్రేలను వాళ్ల భుజాలు, సైకిళ్లకు అటాచ్ చేసిన ప్రత్యేక ర్యాక్పై ఒకదానిపై ఒకటి పేర్చేవాళ్లు. రద్దీగా ఉండే వీధుల్లో కూడా అవి కింద పడకుండా చాలా జాగ్రత్తగా, వేగంగా సైకిల్ తొక్కేవాళ్లు. కస్టమర్లు టెలిఫోన్ ద్వారా లేదంటే రెస్టారెంట్ల వైపు వెళ్లినప్పుడే ఫలానా టైంకి డెలివరీ చేయాలని ఆర్డర్ ఇచ్చేవాళ్లు.
నూడుల్స్ ఎందుకు..?
అప్పట్లో ఎక్కువ మంది నూడుల్స్ మాత్రమే ఆర్డర్ పెట్టుకునేవాళ్లు. జపాన్లో సోబా, ఉడాన్ నూడుల్స్ ఇప్పటికీ చాలా ఫేమస్. వాటిలో పోషకాలు ఎక్కువగా ఉండడం, తక్కువ ధరకే దొరకడం వల్ల ఎక్కువగా తినేవాళ్లు. అప్పట్లో మధ్యతరగతి కుటుంబాలకు, కార్మికులకు ఇదే ప్రధానమైన ఆహారం. డెమో డెలివరీ బాయ్స్ ఈ నూడుల్స్ని చల్లారకముందే డెలివరీ చేసేవాళ్లు.
►ALSO READ | కమెడియన్, రైటర్, హోస్ట్.. టన్నుల కొద్ది టాలెంట్: యూట్యూబర్లిల్లీ సింగ్ సూపర్ఉమన్..!