
హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై అటు హైడ్రా, ఇటు జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నాయి. ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదుల మేరకు ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపడుతున్నారు అధికారులు. ఈ క్రమంలో గురువారం ( జూన్ 19 ) రాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలను కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ను ఆక్రమించి ఏర్పాటు చేసిన వాణిజ్య వ్యాపార సముదాయాలను కూల్చేశారు అధికారులు.
డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు భారీ పొలిసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ పై ఉన్న ఆక్రమణలతో ఇబ్బంది తలెత్తుతోందంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఆక్రమణలకు పాల్పడింది ఎంతటివారైనా సహించేది లేదని.. కూల్చివేతల విషయంలో రాజీ పాడేది లేదని హెచ్చరించారు అధికారులు.
కాగా.. ఈ మధ్య కాలంలో హైడ్రా దూకుడు పెంచింది. మే 19న మియాపూర్ హైదర్ నగర్ దగ్గర సర్వే నంబర్ 145/3లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 9ఎకరాల 30గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేశారు. లే ఔట్ లో మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి. ఆ స్థలాన్ని పలువురు వ్యక్తులు ఆక్రమించారు. 9 నెలల కిందట హెచ్ఎండిఏ లేఔట్ గా తేల్చింది హైకోర్టు. ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించినా కబ్జా దారుల ఖాళీ చేయలేదు.దీంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది హైడ్రా.
గ్రేటర్ పరిధిలో కబ్జాకు గురైన చెరువులు,కుంటలు,ప్రభుత్వ స్థలాలను హైడ్రా పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కట్టిన నిర్మాణాలను,పర్మిషన్ లేకుండా ఇష్టారీతిన కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచే నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.