ఆషాఢం మొదలైంది. భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయింది. ఈ ఏడాది జులై 16 గురువారం నుం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తారు.. ఆషాఢం..ఆధ్యాత్మికం వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .!
హిందూ సంప్రదాయాలకు.. ఆధ్యాత్మికతకు చాలా సంబంధం ఉంది. మనిషి పుట్టుక.. మరణం అన్నీ విచిత్రంగానే ఉంటాయి. పురాణాల ప్రకారం పంచభూతాలతో నిర్మితమైన జీవి శరీరాన్ని మానవాతీత శక్తి నడిపిస్తుందని పండితులు చెబుతున్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ వెనుక ఆధ్యాత్మికం కంటే ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి. వేద పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసం వర్షాకాలంలో వస్తుంది. ప్రస్తుత కాలంలో రైతులు సరిపడ వర్షం కురవకపోయినా.. అడపా దడపా.. పడిన రెండు చినుకులకే ప్రజల ఆరోగ్యాలపై వైరస్లు వాటి ప్రభావాన్ని చూపుతాయి. విష జ్వరాలు.. అంటువ్యాధులు.. వ్యాపిస్తుంటాయి. ప్రస్తుతం వైద్యం అందరికి అందుబాటులో వచ్చింది.. అనేక మందులు వచ్చాయి. కాని పూర్వకాలంలో పల్లెల్లో ప్లేగు, కలరా, మశూచి వంటి అంటు వ్యాధుల బారిన ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్నే మరో భాషలో గత్తర అని పిలిచారు.
వర్షాకాలంలో వైరస్ వ్యాపించకుండా.. అమ్మవారిని ఆరాధిస్తుంటారు. తెలంగాణలో బోనాల పండుగలో అమ్మవారిని ఆరాధించేందుకు ఉపయోగించే వస్తువులన్నీ వైరస్ ను చంపేవే. వేపాకులు, పసుపు నీళ్ల వినియోగంతో అంటు వ్యాధులను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు.
వేపాకులతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ గాలి తగిలినా ఆరోగ్యమే. అందుకే అంటు వ్యాధులు ప్రబలే ఆషాడం ఆరంభంలో బోనాల జాతరలో ఎక్కడచూసినా వేపాకులే కనిపిస్తుంటాయి. పరగడుపునే వేపాకులు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కడుపులో అల్సర్లు, గ్యాస్, కంటికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి.ఇక పసుపు ఆయుర్వేద ఔషధాల్లో ప్రధానమైంది. క్యాన్సర్ ను నిరోధించడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రతి ఇంటి ముందు కళ్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, వేపాకులు, పసుపుతో సూక్ష్మ క్రిములు దూరం అవుతాయి. బోనం కుండలో అన్నం, ఉల్లిగడ్డ, మిరియాలు, పరమాన్నం ఉంచుతారు. దానిపై మూతపెట్టి నూనెపోసి దీపం వెలిగిస్తారు. మొదట ఇంట్లో దేవుడి దగ్గర ఉంచి ఆ తర్వాత ఆలయానికి వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. వంశం వృద్ధి చెందాలని కుటుంబమంతా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ కల్లు సాక పోస్తారు. మశూచి వంటి అనారోగ్యలు రాకుండా ఇది కాపాడుతుందని చెబుతుంటారు.
