జీహెచ్ఎంసీలో మామూళ్లు మామూలే ..ఐదు నెలల్లో ఆరుగురు ట్రాప్

జీహెచ్ఎంసీలో  మామూళ్లు మామూలే ..ఐదు నెలల్లో ఆరుగురు ట్రాప్
  • ఈ ఒక్క నెలలోనే ఇద్దరి పట్టివేత 
  • టౌన్​ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగంలోనే ఎక్కువ అవినీతి 
  • ఏండ్లుగా ఒకే చోట పాతుకుపోవడమూ కారణం
  • ఈ మధ్యే టౌన్​ ప్లానింగ్​లో భారీగా బదిలీలు  
  •  ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​లోనూ ప్రక్షాళనకు కమిషనర్​చర్యలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు:బల్దియాలో అవినీతి కామనైపోయింది. ఏ ఫైల్ ముందుకు కదిలించాలన్నా ఇక్కడ మామూళ్లు మామూలైపోయాయి. ఏ విభాగంలో చూసినా ఇదే పరిస్థితి. ముఖ్యంగా టౌన్​ప్లానింగ్​, ఇంజినీరింగ్​విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణ అనుమతులివ్వడానికి, నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల(ఓసీ)కు భారీగానే డిమాండ్​చేస్తున్నారు. కాసులిస్తే ఫీల్డ్ విజిట్ చేయకుండానే నిర్మాణ అనుమతులిస్తున్నారు.

 ఇంజినీరింగ్​వింగ్​లో ఆఫీసర్లు వేయని రోడ్లకు సైతం బిల్లులు ఇచ్చేస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా సక్రమంగా ఉన్న పనులకు బిల్లులు విడుదల చేయడానికి, పర్మిషన్లు ఇవ్వడానికి బిల్డర్లు, కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం పెరిగిపోవడంతో సహనం నశించిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు వల వేసి పట్టుకుంటున్నారు. ఇలా ఐదు నెలల్లో ఐదుగురు బల్దియా అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇందులో టౌన్ ప్లానింగ్ సూపర్​వైజర్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పన్ను సవరణ పేరుతో బిల్​కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు ఉండడం గమనార్హం..

ఈ నెలలోనే ఇద్దరు మహిళా ఆఫీసర్లు.. 

కేవలం ఈ ఒక్క జూన్​నెలలోనే లంచం తీసుకుంటూ ముగ్గురు బల్దియా అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఉండడం గమనార్హం. కాప్రా సర్కిల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న స్వరూప చర్లపల్లికి చెందిన ఓ కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనిని మెజెర్మెంట్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు రూ. లక్షా 20 వేలు డిమాండ్​చేసింది. ఆ డబ్బులు తీసుకుంటుండగా, ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంబర్ పేట సర్కిల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పని చేస్తున్న మనీషా..కాంట్రాక్టర్ బిల్లును పై ఆఫీసర్​కు పంపడం కోసం రూ.20 వేలు డిమాండ్​చేసింది. 

సదరు కాంట్రాక్టర్ రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చి, మిగతా రూ.15 వేలు ఇస్తూ ఏసీబీ అధికారులకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. ఈ ఇద్దరు ఆరు రోజుల వ్యవధిలోనే ట్రాప్​అయ్యారు. అలాగే,   మే 3న ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దశరథ్ ఫైల్ లో సంతకం చేయడానికి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. గత నెల 23న సికింద్రాబాద్ కు చెందిన అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఠల్ రావు ఓ పర్మిషన్ విషయంలో రూ.8 లక్షలకు ఒప్పందం చేసుకుని, రూ.4 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.

భారీగా బదిలీలు.. 

బల్దియాలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ వింగ్​లో ఆఫీసర్లు, సిబ్బందిపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. వీరిలో చాలామంది ఎక్కువ రోజులు ఒకేచోట పని చేయడం వల్ల కూడా అవినీతి పెరిగిపోతోందని కమిషనర్​కర్ణన్​గుర్తించారు. దీనికి చెక్​పెట్టడానికి టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఐదు రోజుల కింద 13మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్ల(ఏసీపీ)ను, ఇదే విభాగంలోని కీలకంగా వ్యవహరిస్తున్న 14 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేశారు. అయితే, ఇంజినీరింగ్​అధికారుల వ్యవహారం ఆయనకు తలనొప్పిగా పరిణమించిది. 

‘ఇంజినీరింగ్’ అవినీతికి చెక్ పెట్టేందుకు ...

బల్దియాలో టౌన్ ప్లానింగ్ తర్వాత ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఇంజినీరింగ్ అధికారులపైనే వస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో మార్పులు చేయాలని కమిషనర్ కర్ణన్​నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు పనులు చేసిన తర్వాత మెజెర్మెంట్ చేయడంతో పాటు బిల్లులు ఇచ్చే అధికారం ఇంజినీరింగ్​ఆఫీసర్లకే ఉంది. అయితే, బిల్లులు ఫైనల్  చేసే విషయంలో డిప్యూటీ కమిషనర్లను ఇన్వాల్​చేయాలని కమిషనర్ భావిస్తున్నారు. ముందు ఇంజినీరింగ్​అధికారులు, ఆ తర్వాత డీసీలు ఫైనల్ చేసిన తర్వాతే బిల్లులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం.