టెహ్రాన్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఆదేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని మరణించిన తర్వాత ఇరాన్లో భారీ రాజకీయ , భద్రతా మార్పు కనిపిస్తోంది.ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి అధిపతిగా వ్యవహరించిన లారిజాని, తన కుమారుడు ,ఒక సన్నిహిత సహచరుడితో కలిసి ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యారు.ఇరాన్ పాలనా వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి లారిజాని. అయితే వారసులను ముందుగానే సిద్ధం చేసుకోవడంలో ముందుండే ఇరాన్ ..ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు వస్తారనే దానిపై అందరి దృష్టి మళ్లింది.
అమెరికా ,ఇజ్రాయెల్లతో యుద్దాన్ని సాగించడంతో అణు చర్చలను పర్యవేక్షించడంలో, అంతర్గత నిరసనలు ,భద్రతాపరమైన అంశాలను పరిష్కరించడంలో లారిజాని కీ రోల్ పోషించారు.సంక్షోభ సమయాల్లో లారిజానీ నాయకత్వం అత్యంత కీలకమైనది. ఆయన మరణంతో ఇరాన్లో అధికార సమతుల్యత తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పుడు ప్రాంతీయ ఉద్రిక్తతలను ,అంతర్గత రాజకీయాలను సమర్థవంతంగా నిర్వహించగల వ్యక్తిని ఎన్నుకునే సవాల్ నాయకత్వానికి ఎదురైంది.
లారిజానీ స్థానంలో సయీద్ జలీలీ!
లారిజాని మరణం తర్వాత కూడా వారసులను ముందుగానే సిద్ధం చేసుకోవడంలో ప్రసిద్ధి ముందుండే ఇరాన్ సమర్థులైన నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్దమైంది. ఇరాన్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించగల సమర్థులైన నాయకుల పేర్లలో ఒకటి సయీద్ జలీలీ.
సయీద్ జలీలీ ఇరాన్ సీనియర్ నేతల్లో ఒకరు. మాజీ అణు చర్చల ప్రతినిధి. మహమూద్ అహ్మదీ నెజాద్ అధ్యక్ష పదవిలో ఉన్నపుడు 2007నుంచి 2013 వరకు పాశ్చాత్య దేశాలతో జరిగిన చర్చలకు ఈయన నాయకత్వం వహించారు. కఠినమైన, రాజీలేని వైఖరికి కలిగిన జలీలీ 2015 నాటి అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
సయీద్ జలీలీ 1965లో ఇరాన్ లోని మషద్లో జన్మించారు. ఆయన ఇమామ్ సాదిఖ్ యూనివర్సిటీనుంచి రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. అక్కడే ప్రొఫెసర్ గా కూడా చేశారు. ఇరాన్,-ఇరాక్ యుద్ధంలో పోరాడి తన ఒక కాలును కోల్పోయారు. ఈ కారణంగా ఇరాన్లో ఆయనను తరచుగా జీవించి ఉన్న అమరవీరుడు అని పిలుస్తారు. ఆయన 2013 అధ్యక్ష ఎన్నికలలో కూడా పోటీ చేసి, మూడవ స్థానంలో నిలిచారు.
జలీలీ కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ప్రజాదరణ పొందిన నాయకుడని ఇరానియన్లు చెబుతుంటారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు నాయకత్వం వహించే బలమైన అభ్యర్థిగా చాలామంది భావిస్తున్నారు.
