
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో 14 అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్కు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు సత్యనారాయణ, వేణుగోపాల్, పంకజ, అలివేలు మంగతాయారు, సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు.
- ప్రధానంగా లోయర్ ట్యాంక్ నుంచి సచివాలయంవైపు వచ్చే తెలుగుతల్లి ఫ్లైఓవర్ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మార్చాలని ప్రతిపాదించారు. టేబుల్ ఐటెమ్కింద ఈ సిఫార్సును కార్పొరేషన్కు పంపనున్నారు.
- జీహెచ్ఎంసీలోని 145 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న మెడికల్ ఇన్సూరెన్స్ వారి పదవీకాలం ముగిసే వరకు (ఫిబ్రవరి 2026 వరకు) పొడిగించేందుకు రూ.33.53 లక్షలు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.
- అలాగే స్ట్రీట్ లైట్స్ నిర్వహణ కోసం మూడు నెలల పాటు కొత్త టెండర్లు పిలవాలా లేదా ప్రస్తుత 17 మంది డీఐసీ విక్రేతలతో కాంట్రాక్ట్ను పొడిగించాలా అనే నిర్ణయం తీసుకునేందుకు సభ్యులు అనుమతించారు.
- ఏటా భవిష్యత్తులో అవసరమని భావించిన రోజుల్లో మాంసం, బీఫ్ దుకాణాలు, వధశాలలను మూసివేసే అధికారాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఇవ్వడానికి ఆమోదించారు.
- జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ స్వయం సహాయక సంఘాల వర్కర్ల జీత ఖాతాలను ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రారంభించడంతో పాటు, వారికి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లబ్ధి కల్పించేందుకు ప్రతిపాదించారు.