హైదరాబాద్ లో చెత్త సమస్యను తీర్చేందుకు.. త్వరలో సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు

హైదరాబాద్ లో చెత్త సమస్యను తీర్చేందుకు.. త్వరలో సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు
  •     36 చోట్ల స్థలాల పరిశీలన
  •     చెత్త సేకరణలో ఇబ్బందులకు చెక్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో చెత్త సేకరణ సమస్యను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ సెకండరీ ట్రాన్స్​ఫర్ స్టేషన్లను పెంచనుంది. ప్రస్తుతం 42 ఉన్న ఈ స్టేషన్ల సంఖ్యను మరో 18కి పెంచి మొత్తం 60కి చేర్చనున్నారు. దీనికి సంబంధించి 36 చోట్ల స్థలాలను బల్దియా అధికారులు పరిశీలించారు. ఇందులో 18 ప్రాంతాలను అధికారులు ఫైనల్ చేసి, త్వరలోనే నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. నగరంలో రోజువారీ చెత్త ఉత్పత్తి 8 వేల టన్నులకు చేరడంతో సెకండరీ కలెక్షన్ పాయింట్లకు చెత్తను తరలించి, అక్కడి నుంచి జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలు ట్రాన్స్​ఫర్ స్టేషన్ల వద్ద క్యూ కడుతుండడంతో ఆన్​లోడింగ్​కు టైమ్​పడుతోంది. ఫలితంగా, కాలనీల్లో చెత్త సేకరణ ఆలస్యమవుతూ, కవరేజ్ ప్రాంతాలు తగ్గుతున్నాయి. అలాగే సెకండరీ స్టేషన్లపై లోడ్​పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో భరించలేని కంపుకొడుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రాన్స్​ఫర్ స్టేషన్లతో ఈ సమస్యలు తీరనున్నాయని అధికారులు చెప్తున్నారు.