జీహెచ్ఎంసీ( GHMC) కార్మికులు ఇవాళ్టి(ఆగస్టు 18) నుంచి సమ్మెబాట పట్టారు. ఎల్బీనగర్ జీహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికుల ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాల డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు అందిస్తున్న విధంగా ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్ డీఏలు వెంటనే ఇవ్వాలన్నారు. రాంకీ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్నారు. ట్రాన్స్పోర్టు సెక్షన్ లో తొలిగించిన లేబర్, డ్రైవర్లను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జోనల్ ఆఫీసుల వద్ద నిరసనకు దిగిన వందల మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. మరి కాసేపట్లో జీహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ కు పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం రెండు వైపులా బారిగెట్లు ఏర్పాటు చేసి.. బయటి వారిని అనుమతించడం లేదు పోలీసులు.
విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతున్నట్లు GHMEU ప్రెసిడెంట్ గోపాల్ ఇప్పటికే ప్రకటించారు. నేటి నుంచి అన్ని సర్కిల్, జోనల్ ఆఫీసులతో పాటు హెడ్డాఫీసు వద్ద కార్మికులు సమ్మె నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. సమ్మెను కార్మికులు సక్సెస్ చేయాలని కోరారు.