నెల రోజుల్లో రూ.44 లక్షలు ఫైన్

నెల రోజుల్లో రూ.44 లక్షలు ఫైన్
  • సిటీలో బల్దియా బృందాల తనిఖీ
  • ఉల్లంఘనలకు భారీగా జరిమానా
  • పారిశుధ్య నిర్వహణపై సీరియస్

హైదరాబాద్, వెలుగు:   స్వచ్ఛ నిబంధనలపై ప్రజలకు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు  రూల్స్ పాటించని వారిపై జీహెచ్​ఎంసీ  కొరడా ఝళిపిస్తోంది. నగర పరిశుభ్రతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.   స్వచ్ఛత ఉల్లంఘనలకు  పాల్పడే వారిని అక్కడికక్కడే పట్టుకుని జరిమానా విధిస్తోంది. ఈ నేపథ్యంలో బల్దియా బృందాలు  నిఘా పెంచాయి.  పబ్లిక్ ప్లేస్ లో తిరుగుతూ జరిమానాలు విధిస్తున్నాయి.

రోడ్లపై ఉమ్మివేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, నాలాల్లో చెత్త పడేయడం ఇలా ఒక్కో ఉల్లంఘనకు రూ.100  నుంచి రూ.10,000  వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో విధించిన జరిమానాలలో ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం, సర్టిఫై చేయని మాంస విక్రయాలు, హోటల్ లలో పరిశుభ్రత పాటించకపోవడం, అక్రమంగా బ్యానర్లు ఏర్పాటు కేసులే ఉన్నాయి. ఈ ఘటనల నుంచి అధిక మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తోంది.  మే 25వ తేదీ నుంచి అధికారులు చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వ‌ర‌కు 2809 మంది వ్యక్తులు, సంస్థల‌కు రూ. 44,04,950 ల‌క్షలు జ‌రిమానాలు విధించారు.