న్యూఢిల్లీ: కరోనా ట్రీట్మెంట్లో వాడే ఫవిఫిరవిర్ ట్యాబ్లెట్ ధరను ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ 27 శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఒక ట్యాబ్లెట్ ధర రూ. 103 నుంచి రూ. 75 లకు తగ్గింది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న పేషెంట్ల కోసం ఫవిపిరవిర్ డ్రగ్ను ఫబిఫ్లూ బ్రాండ్ పేరుతో గ్లెన్మార్క్ మార్కెట్లోకి తెచ్చింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. ఇండియాలోని కంపెనీ ప్లాంట్ల వద్ద తయారవుతున్న ఈ మెడిసిన్ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ), పార్ములేషన్స్ ఎక్కువ సైజ్లో తయారు చేస్తుండడం, లాభదాయకంగా ఉండడంతో ఈ ధర తగ్గింపు సాధ్యమైందని గ్లెన్మార్క్ పేర్కొంది. ఈ ప్రయోజనాన్ని దేశంలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు బదిలీ చేయాలనుకుంటున్నామని తెలిపింది. ఇతర దేశాలలో లాంఛ్ అయిన ఫవిపిరవిర్ ధర కంటే ఫబిఫ్లూను తక్కువకే తీసుకొచ్చామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం దీని ధర మరింత తగ్గిస్తున్నామని, ధరలు తగ్గడంతో ఈ మెడిసిన్ పొందడానికి పేషెంట్లకు మరింతగా వీలుంటుందని తెలిపింది. ఈ డ్రగ్ క్లినికల్ ప్రభావాన్ని, సేఫ్టీని పరిశీలించడానికి వేయి మంది పేషెంట్లను అబ్జర్వ్ చేస్తోంది. ఫబిఫ్లూను తయారీ, మార్కెటింగ్ చేసుకోవడానికి గ్లెన్మార్క్కు జూన్ 20 న డ్రగ్ రెగ్యులేటరీ నుంచి అనుమతులొచ్చాయి. ఫవిపిరవిర్(ఫబిఫ్లూ) ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ను గ్లెన్మార్క్ పూర్తి చేసింది. ఈ ట్రయల్స్ రిజల్ట్స్ను తొందర్లో అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. యాంటివైరల్ డ్రగ్స్ ఫవిపిరవిర్, యుమిఫెనొవిర్ డ్రగ్స్ కాంబినేషన్ ఫేజ్3 క్లినికల్ ట్రయల్స్ను కూడా గ్లెన్మార్క్ నిర్వహిస్తోంది. దీనిని హాస్పిటల్లో జాయిన్ అయిన తక్కువ ఎఫెక్ట్ అయిన కరోనా పేషెంట్లపై నిర్వహిస్తోంది. సోమవారం సెషన్లో గ్లెన్మార్క్ షేరు 1.34 శాతం పడిపోయి రూ. 421 వద్ద ముగిసింది.
