- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి(పెగడపల్లి), వెలుగు: గోదావరి పుష్కరాలు–2027 కోసం చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ముందు చూపుతో గోదావరి పుష్కరాలకు ధర్మపురిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో పుష్కరాల సమయంలో పనుల నాణ్యత లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారని, ఈసారి పకడ్బందీగా పనులు చేపట్టాలన్నారు.

