
- కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి నిధులు తేకపోవడం బాధాకరం: మంత్రి సురేఖ
- కేంద్రం.. తెలంగాణ, ఏపీని వేర్వేరుగా చూడడం సరికాదని వ్యాఖ్య
వరంగల్, వెలుగు: గోదావరి పుష్కరాలకు సంబంధించి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి సోమవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసిడింగ్కాపీలు అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జూన్ 27 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మొదటి విడతగా కోట్లలో నిధులిచ్చిందని, ఇప్పటికే అక్కడ పనులు మొదలుపెట్టారని చెప్పారు. తెలంగాణకు మాత్రం రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను రెండు కళ్లుగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీని ఒకలా.. తెలంగాణను మరోలా చూడటం భావ్యం కాదన్నారు.
మంత్రి కిషన్రెడ్డి ఇప్పటికైనా రెండు రాష్ట్రాలకు సమానంగా నిధులు వచ్చేలా చూడాలని, పుష్కరాలను విజయవంతం చేయడానికి సహకరించాలన్నారు. తాను కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖ రాయనున్నట్టు చెప్పారు.