సతుపల్లి/ కల్లూరు, వెలుగు: తొలకరి నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు వస్తాయని, యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి, బేతుపల్లి చెరువు ద్వారా వేంసూరు మండలంలో గోదావరి జలాలను పారిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. సత్తుపల్లి మీదుగా అశ్వారావుపేట వరకు ఉన్న రహదారి ఫోర్లేన్ జాతీయ రహదారిగా కాబోతోందని చెప్పారు.
మున్సిపల్ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి రోడ్ షో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారని చెప్పారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్ ను త్వరలోనే రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలను పదేండ్లు మోసం చేసింది చాలదా అని ప్రశ్నించారు. సత్తుపల్లిలోని 23 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.
కల్లూరును నంబర్ వన్గా తీర్చిదిద్దుతా
కల్లూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి కృష్ణ మ్యాంగో మార్కెట్ నుంచి డీఎన్పీ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి ఒక్కో కౌన్సిలర్కు అభివృద్ధి పనుల కోసం రూ.కోటి నిధులు ఇస్తామన్నారు.
కాంగ్రెస్ప్రభుత్వంలో మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మట్టా దయానంద్, ఏఎంసీ చైర్పర్సన్ భాగం నీరజాదేవి, సంతాన వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ధారా రంగా, నాయకులు పసుమర్తి చందర్రావు, పొట్రు అర్జున్ రావు , లక్కినేని కృష్ణ, భాగం ప్రభాకర్ తదితరులు
పాల్గొన్నారు.
