- బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్
ఓయూ,వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, గురుకులాలను అద్దె భవనాల్లో అరకొర వసతులతో నిర్వహిస్తున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ ఆరోపించారు. అధికార పార్టీ జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించుకుంటుందని కానీ, పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడం లేదని మండిపడ్డారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా బీసీలు అనుసరించాల్సిన విధానాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు శనివారం హైదరాబాద్లో నిర్వహించే బీసీల రాజకీయ ప్లీనరీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఓయూ ఆర్ట్స్కాలేజీ వద్ద ప్లీనరీ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను ప్రతి సంవత్సరం పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం నేతలు సాయితేజ, రాజేశ్, నరేశ్, సురేష్, రవి పాల్గొన్నారు.